శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ని, విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కలర్ఫుల్ పోస్టర్ని కూడా ఈ సందర్భంలోనే చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘జార్జ్ క్రిష్’ చిత్రం విడుదల కానున్నదని ప్రారంభోత్సవం రోజే మేకర్స్ ప్రకటించడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత సురేశ్బాబు కెమెరా స్విచాన్ చేయగా, బీఆర్ఎస్ నాయకుడు, శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు.
చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తొలిషాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 28 నుంచి నాన్స్టాప్ షూటింగ్ ఉంటుందని, వచ్చే ఏడాది జనవరి 14న సినిమాను విడుదలచేస్తామని, ఈ కథపై చిత్రబృందమంతా నమ్మకంతో ఉన్నామని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి రచన: నందు సవిరిగాన, గోపీ మోహన్, కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: అనూప్ రూబెన్స్, సహ నిర్మాత: అజయ్ సుంకర, సమర్పణ: ఏటీవీ.