హైదరాబాద్: ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టీ-హబ్లో జరిగిన డిప్లొమాటిక్ ఔట్రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్నారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతున్నదని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు. ఫార్మస్యూటికల్ హబ్, బయోసైన్స్ హబ్గా ఉందని చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే తయారవుతాయని వెల్లడించారు.
15 వందలకుపైగా మల్టీనేషన్ కంపెనీలు హైదరాబాద్లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్ బ్రాంచిని హైదరాబాద్లో ప్రారంభించాయని వెల్లడించారు. ప్రపంచంలో భారత్ నంబర్ వన్లో ఉండాలంటే ఇన్నేవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్నెస్ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు.
Live: IT & Industries Minister @KTRTRS sharing his thoughts at the ‘Diplomatic Outreach Program’ at @THubHyd https://t.co/HHYbg8ha54
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2022