సిద్దిపేట జోన్, మే 4 : ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే వ్యాధులు దరిచేరవని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జనగామ జిల్లా కమిటీ ప్రతినిధి, ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఏప్రిల్ 3న జనగామ జిల్లా బతుకమ్మ కుంట నుంచి ‘వ్యాయామం చేద్దాం.. కరోనాను నివారిద్దాం’ అనే నినాదంతో సైకిల్యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో యాత్ర చేస్తూ మొత్తం 2400 కి.మీ చేయనున్న సైకిల్ యాత్ర మంగళవారం సిద్దిపేటకు చేరింది. సిద్దిపేట జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్, స్వేరోస్ ఇంటర్నేషనల్, స్వేరోస్ సర్కిల్, తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్, ట్రూ టీచర్స్ కోయలేషన్, ఎస్ఎస్యూ సంస్థల ప్రతినిధులు భరత్కు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆలోచన విధానాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. కరోనా వ్యాధికి గురికాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి వ్యాయామం చేయాలని, శరీరంలోని చెడును తొలగించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. దేశంలోని ప్రజలను రక్షించేందుకు సరిహద్దుల్లో సైనికులు ఉన్నారు.. కానీ కరోనా వ్యాధి నుంచి కాపాడడానికి మీకు మీరే అవసరమని చెప్పారు. ఈ యాత్ర సిద్దిపేట నుంచి మెదక్ మీదుగా సంగారెడ్డి చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్, స్వేరోస్ అనుబంధ సంస్థల ప్రతినిధులు నర్సింహాచారి, కరికె సత్యనారాయణ, మంద జనార్దన్, సుధాకర్, ప్రవీణ్కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు.