మహబూబాబాద్ : పల్లె ప్రగతి అంటే పల్లెలో ఉండే ఉద్యోగులు, ఐటీ, సాఫ్ట్ వేర్, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులందరి సహకారంతో కొనసాగే ప్రగతి. ఇందులో అందరినీ భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పల్లెలను అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన గొప్ప అవకాశం పల్లె ప్రగతి అన్నారు. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం పనులపై మహబూబాబాద్, నందన గార్డెన్స్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
పల్లె ప్రగతి పనులు ప్రణాళిక బద్ధంగా కొనసాగించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి, అక్కడి అవసరాలను గుర్తించాలని, వాటిని ఈ పది రోజుల్లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఈ గ్రామ సభకు భాగస్వాములందరిని ఆహ్వానించాలని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయి. ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సమర్పించాలన్నారు.
ముఖ్యంగా దళితవాడలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలన్నారు. వారి అవసరాలు గుర్తించి, వాటిని తీర్చే విధంగా ప్రణాళిక తయారు చేసి అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు అసంపూర్తిగా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలని, పూర్తి అయిన వాటిని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. సీఎం కేసీఆర్కు హరితహారం అంటే అత్యంత ఇష్టమని, ఇది ఆయన మానస పుత్రిక అన్నారు. దీనిని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, అభిషేక్ అగస్త్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి