KCR | రేపు (శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలన నుండి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి, నేటికి 79 ఏండ్లు గడిచినాయని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
త్యాగనిరతితో ఎందరో అమర వీరులు, దేశ భక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు చేరే దాకా కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర సమరాన్ని నిరాయుధ శాంతియుత పద్ధతిలో నడిపించిన మహాత్మాగాంధీ అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడివున్నదని తెలిపారు.
జాతి ఆత్మగౌరవం కోసం స్వయంపాలన కోసం చేసిన త్యాగాలు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో స్వార్థ రాజకీయాలకోసం దుర్వినియోగం కావడం బాధాకరమని కేసీఆర్ తెలిపారు. స్వతంత్ర్య భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం పదేండ్ల అనతికాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. అమరుల త్యాగాలను గౌరవించి, స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు చేరి, దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ఇనుమడిస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు.