Hyderabad : హైదరాబాద్లో నెదర్లాండ్స్ దేశస్థురాలిపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత సందర్శనలో భాగంగా సిటీకి వచ్చి కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న సదరు మహిళను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ సంఘటనపై డచ్ మహిళ తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
నెదర్లాండ్స్కు చెందిన 36 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి మార్చి 5 నుండి 23 మధ్య భారత్ను సందర్శించింది. ఈ సమయంలోనే హైదరాబాద్కు వచ్చిన ఇద్దరూ కొండాపూర్లో స్టే చేశారు. అయితే.. ఓరోజు ఆమె బాయ్ఫ్రెండ్ గదిలో లేని సమయంలో ఓ యువకుడు ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, పలుమార్లు లైంగికంగా వేధించాడు. మార్చి 17న ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అర్ధనగ్నంగా వెళ్లిన అతడు ఆమెను తాకుతూ, తన స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలోనే ఆ మహిళ బాయ్ఫ్రెండ్ ఇంటికి తిరిగి రావడంతో లైంగిక దాడి నుంచి తను తప్పించుకుంది.
నెదర్లాండ్స్కు తిరిగి వెళ్లిన తర్వాత హైదరాబాద్లో జరిగిన సంఘటన గురించి బాయ్ఫ్రెండ్కు చెప్పి బోరును ఏడ్చింది బాధితురాలు. అనంతరం తనపై జరిగిన లైంగిక దాడి సంఘటన గురించి డచ్ రాయబార కార్యాలయానికి తెలియజేసిందామె. జూలై 22న పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్కు వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా.. గచ్చిబౌలి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75, 78, 79 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదిత్య ఆనంద్గా గుర్తించిన పోలీసులు.. పరారీలో ఉన్న అతడికోసం గాలిస్తున్నారు.