హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తుశాఖ అత్యవసర సేవల కిందకు వస్తుందని, అత్యవసర సేవలకు ఆటంకం కల్పించవద్దని ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డికి సూచించారు. లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్న నేపథ్యంలో పలుచోట్ల విద్యుత్తు ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వెళ్లగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, విధులకు హాజరు కాకుండా వెనక్కి పంపించేశారని, మరికొందరు ఉద్యోగులను లాఠీలతో కొట్టినట్టుగా ఫిర్యాదులు రావడంతో మంత్రి స్పందించారు. శనివారం డీజీపీతో మంత్రి ఫోన్లో మాట్లాడి.. విద్యుత్తు ఉద్యోగులను అడ్డుకోవద్దని, అత్యవసర సేవలకు ఆటంకం కల్పించొద్దని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్తు సిబ్బందిపై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇదే సమయంలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులను చూడకుండా లాఠీలకు పనిచెప్పవద్దని ఆదేశించారు. నల్లగొండ తదితర చోట్ల జరిగిన ఘటనలపై డీజీపీతోనూ, జిల్లా ఎస్పీతోనూ మాట్లాడి.. అనుచితంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తుశాఖ సిబ్బంది, అధికారులను పోలీసులు కొట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది. విద్యుత్తుశాఖ ఐడీకార్డు చూపిస్తే పోలీసులు వదిలేయాలి. విద్యుత్తుశాఖకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉన్నది. మేము అత్యవసర సేవల కిందకే వస్తాం. వినియోగదారులకు, దవాఖానలకు 24 గంటలపాటు విద్యుత్తును ఇచ్చేందుకు సంస్థలు, సిబ్బంది పనిచేస్తున్నారు.
–ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు
ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో భాగంగా బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐడీ కార్డును ధరించాలి. వాహనంపై సంస్థ స్టిక్కర్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్తు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఐడీకార్డు, వాహనాలపై స్టిక్కర్ ఏర్పాటుచేసుకునేలా ఎస్ఈలు చూడాలి.
–ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
ఎస్పీడీసీఎల్ సీఎండీ ఉత్తర్వులు విధి నిర్వహణలో భాగంగా.. కొవిడ్ బారిన పడిన ఉద్యోగులు, సిబ్బందికి 15 రోజులపాటు జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ జీ రఘుమారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.