భద్రాద్రి కొత్తగూడెం : బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు. గొప్పలు చెప్పుకోవడం కోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ పాదయాత్రతో ఎవరికీ ఉపయోగం లేదన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుంటే, ఓర్వలేని బీజేపీ నాయకులు పసలేని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని, ఎవరెన్ని విమర్శలు చేసినా టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి దళితులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మందికి దళితబంధు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తుంటే చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతోందని, దమ్ముంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తెప్పించాలని సవాల్ విసిరారు.
2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం 2 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆంతోటి నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం