హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు సంబంధించి మేజర్ ప్రాజెక్టుల కింద క్రాప్హాలిడే ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలనే దానిపై ప్రభుత్వం అధికారులకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది గోదావరి బేసిన్లో కడెం, దేవాదుల, నిజాంసాగర్, పలు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలకు, కృష్ణా బేసిన్లో మూసీ, డిండి, కోటిపల్లి తదితర మీడియం ప్రాజెక్టుల కింద 95,108 ఎకరాలకు మొత్తంగా రెండు బేసిన్లలో కలిపి 7,01,063 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫేజ్-1, ఫేజ్-2 కింద కలిపి మొత్తంగా 13 లక్షల ఎకరాలకుపైగా ఉండగా, ఒక్క ఎకరాకు కూడా నీరివ్వని పరిస్థితి నెలకొన్నది.
కృష్ణా బేసిన్లో నాగార్జునసాగర్తోపాటు జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ తదితర లిఫ్ట్ స్కీమ్ల కింద కూడా ఆయకట్టును ఖరారు చేయలేదు. మొత్తంగా మేజర్ ప్రాజెక్టులు, లిఫ్ట్ స్కీమ్ల కింద క్రాప్హాలిడే ప్రకటించింది. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న జలాలను కేవలం తాగునీటికే వినియోగించాలని నిర్ణయించింది. అధికారులతో మంగళవారం సాయ ంత్రం నిర్వహించిన సమీక్షలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.