కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 19 : రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ను అభివృద్ధి చేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశించారు. నగర అభివృద్ధి ఒకటే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇంజినీర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి పరిషారం చూపే దిశగా అధికారులకు నిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగరంలో ఎక్కడా పారిశుధ్యలోపం లేకుండా చూడాలని, ఎలక్ట్రికల్ సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వానకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలన్నారు.
స్మార్ట్సిటీ, యూడీఐఎఫ్, యూసీఎఫ్ నిధులను ఏ ఒక డివిజన్కు పరిమితం చేయకుండా అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించి సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్కుమార్గౌడ్, మాజీ మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్లు గుగ్గిల్లపు జయశ్రీ, సుధగోని మాధవి, జమ్ము, యూసుఫ్, అలీ, ప్రదీప్, మల్లేశం, నలువాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.