హైదరాబాద్: సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. దళితంబంధు పథకంపై విపక్షాల కుట్రలకు నిరసనగా హైదరాబాద్లోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తాను 30 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్లా దళితుల అభివృద్ధి కోసం కృషిచేయలేదన్నారు. దళితుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఎవరు మంచిపని చేసినా ఆహ్వానించాల్సిందేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సమసమాజ స్థాపనకోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. దళితులంతా సీఎం కేసీఆర్కు మద్దతుగా ఉండాలన్నారు. దళితబంధు పథకాన్ని విజయంవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళితుల అభివృద్ధికోసం రూ.లక్షా 75 వేల కోట్లు ఖర్చు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, ముఖ్యమంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గతంలో సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమించమని కోరుతున్నానని చెప్పారు. దళితబంధును అడ్డుకుంటే విపక్షాలకు మనుగడ ఉండదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్రెడ్డి శనిపాదం అని మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణలో టీడీపీని సర్వనాశనం చేసిందే రేవంత్రెడ్డి అని, ఆయన జీవితం మొత్తం మోసమేనని దుయ్యబట్టారు. వందలకోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. తన సొంత ఊరిలో దళితులను ఏనాడైనా గౌరవించాడా అని ప్రశ్నించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. దళితబంధు పథకంపై విమర్శలు చేస్తున్న రేవంత్రెడ్డిని దళితులు తమ ఊరికి రానీయొద్దన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఎవరికోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఆయన పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు.