సిద్దిపేట, ఏప్రిల్ 25: సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ సభ వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణం వేదిక కుడివైపున ఉన్న గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ స్రీన్ ఎదుట ప్రజలు వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అమిత్షా సభకు రావడం ఆలస్యం కావడంతో ప్రజలు సభ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. అమిత్షా మధ్యాహ్నం1:56 నిమిషాలకు సభ వేదికపైకి చేరుకొని ప్రసంగాన్ని ప్రారంభించి 2.05 నిమిషాలకు ముగించారు. అమిత్ షా ప్రసంగిస్తున్నంత సేపు సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభలో అమిత్షాకు సహారాఇండియా బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. సహారా ఇండియాలో రాష్ట్రం నుంచి చాలామంది పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. అమిత్షా సభ సిద్దిపేటలో ఉందని తెలుసుకొని పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వరంగల్ సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి సహారా ఏజెం ట్లు, ఖాతాదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సహారా ఇండియాలో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.