Harish Rao | హైదరాబాద్ : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది అని హరీశ్రావు విమర్శించారు.
ఆర్టీఐ యాక్టు ద్వారా ప్రజావాణిపై సేకరించిన సమాచారం ఆధారంగా పలు అంశాలను హరీశ్రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10 నిమిషాల పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని తెలిపారు. దీన్నిబట్టి ప్రజా దర్బార్ పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైపోయింది. మంత్రులు అందుబాటులో ఉంటారని మాట మార్చారు. ఆ మాటా నిలబెట్టుకోలేదు. మంత్రులకు గాంధీభవన్కు వెళ్లేందుకు ఉన్న తీరిక, ప్రజావాణికి రావడానికి మాత్రం ఉండటం లేదు. దీంతో ప్రజావాణి పట్ల మంత్రుల చిత్తశుద్ధి ఏపాటిదో కూడా తేటతెల్లమైపోయింది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రాక, మంత్రులూ రాక, చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, కడహీనంగా వారానికి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆ రెండు రోజుల ప్రజావాణికి రావడం, దరఖాస్తులు సమర్పించుకోవడం ఉత్త వృథా ప్రయాసే అవుతున్నదని జనం వాపోతున్నారు అని హరీశ్రావు తెలిపారు.
ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, అందులో కేవలం 43, 272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి గ్రీవెన్సెస్ పరిధిలోకి రావంటున్నారు. గ్రీవెన్సెస్కు సదరు అధికారులిస్తున్న నిర్వచనం ఏమిటంటే… ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం…వీటినే గ్రీవెన్సెస్ కింద పరిగణిస్తామంటున్నారు. ఈ నిర్వచనం ప్రకారం భూ తగాదాలు గానీ, భూ నిర్వాసితుల సమస్యలు గానీ, నిరుద్యోగుల సమస్యలు గానీ, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు గానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్సెస్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించేశారు. గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50 శాతం ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైంది అని హరీశ్రావు తెలిపారు.
ప్రజావాణికి వచ్చిన మొత్తం 82,955 పిటిషన్లలో.. గ్రీవెన్సెస్గా గుర్తించినవి 43,272 మాత్రమే. వీటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అట్లా పంపిన 43,272 గ్రెవెన్సులలో 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని చెబుతున్నారు. అయితే 27,215 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఫైల్ క్లోజ్ చేశారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్రావు చెప్పారు.
ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకు వస్తే, ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృథా అవుతున్నదని ప్రజలు వాపోతున్నారు. కొండంత ఆశలు రేపి, గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది. మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటిమీది రాతగా మిగిలిపోయిందని హరీశ్రావు విమర్శించారు.
Harish Rti1
Harish Rti
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు