MLC Kavitha | హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని, నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది అని కవిత గుర్తు చేశారు.
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదు.
ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత సవాల్ విసిరారు.
కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలి. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు సావిత్రీబాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు అని కవిత ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్
KTR | రైతుబంధును బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం : కేటీఆర్