వరంగల్/హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్లోబరీనా తన బినామీ సంస్థ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఖండించారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై తాను ఇప్పటికే ఆయనకు లీగల్ నోటీసు పంపినట్టు తెలిపారు. ‘48 గంటల్లో ఆ ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. హనుమకొండ పర్యటనకు గురువారం వచ్చిన కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘గ్లోబరీనా నిజంగానే నా బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది? ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రికి కనీస సోయి లేదా?’ అని ప్రశ్నించారు. సీసీఎస్లో ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, అందుకు తాము కూడా పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
‘విచారణ జరిగితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అవసరమైతే నేను కూడా ఫిర్యాదు చేస్తాను. అదే సమయంలో సృజన్రెడ్డి వ్యవహారం, సింగరేణి కుంభకోణం వంటి అంశాలపై కూడా విచారణ జరుపడానికి ప్రభుత్వం సిద్ధమేనా? ఈ అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు. గ్లోబరీనా వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి హోంమంత్రిగా నిజాయితీగా వ్యవహరించాలని కోరుతున్నాను. వెంటనే విచారణ ప్రారంభించండి. సీఐడీతో చేస్తారా, సీబీఐతో చేస్తారా, ఏ సంస్థతో చేయాలనుకున్నా చేయండి. పూర్తి సహకారం అందిస్తాను. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అవసరమైతే లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. ‘నన్ను, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని పకపకన కూర్చోబెట్టి, ప్రత్యక్ష ప్రసారంలో లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించండి. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అదే సమయంలో సింగరేణి, అమృత్ కాంట్రాక్టుల్లో జరిగిన ఆరోపణలపై కూడా ప్రజల ముందే నిజానిజాలు తేల్చుకుందాం. ఏది నిజమో ప్రజలే నిర్ణయిస్తారు’ అని సవాల్ విసిరారు. ‘ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం వెనుక ఉన్న కారణాన్ని ప్రజలకు చెప్పాలి. మోదీ పేరును ప్రస్తావించడానికే ఎందుకు భయపడుతున్నారో కూడా సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటా
తనపై, తన కుటుంబంపై ఎటువంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తూ తమ పరువుప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేటీఆర్ గురువారం లీగల్ నోటీసులు పంపించారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజలకు తనపై ఉన్న నమ్మకం కోల్పోయేలా ఉన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యాతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి తనకు, గ్లోబరీనా టెక్నాలజీ కంపెనీకి సంబంధాన్ని అంటగడుతూ ఎలాంటి ఆధారాల్లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. నోటీసు అందిన 48 గంటల్లోగా బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతోపాటు పరువునష్టం దావా దాఖలు చేస్తానని హెచ్చరించారు.
గ్లోబరీనాతో ఎలాంటి సంబంధంలేదు..
గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, దానిపై యాజమాన్య హక్కులు లేవని కేటీఆర్ స్పష్టంచేశారు. గ్లోబరీనా తన బినామీ కంపెనీ అని, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానని అనడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ముఖ్యమంత్రి వంటి అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దిగజారి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పలుమార్లు ఇదేవిధంగా అనుచితంగా మాట్లాడినా రాజకీయ విమర్శలుగా భావించి సహనం ప్రదర్శించానని పేర్కొన్నారు. కానీ రోజురోజుకూ శ్రుతి మించుతుండటంతో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించానని స్పష్టంచేశారు.