ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఉప సమరానికి రంగం సిద్ధం
17 సర్పంచ్, 26 ఎంపీటీసీ, 211 వార్డు స్థానాలకు ఎన్నికలు ఇప్పటికే ముసాయిదా
8వ వరకు అభ్యంతరాలు స్వీకరణ
12న తుది జాబితా ప్రచురణ
ప్రారంభమైన ఎన్నికల వేడి
మహబూబ్నగర్ ఏప్రిల్ 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఉప పోరుకు రంగం సిద్ధమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికల ఏర్పాట్లు షురూ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 సర్పంచ్, 26 ఎంపీటీసీ, 211 వార్డు స్థానాలకు ఉప సమరానికి అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పాలమూరు జిల్లాలో అత్యధిక స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నది. 7 సర్పంచ్, 15 ఎంపీటీసీ, 91 వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ నున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో ఖాళీ అయిన స్థానాల్లో ఇప్పటికే ముసాయిదా జాబితా ప్రచురించారు. 8వ తేదీ వరకు అధికారులు అభ్యంతరాల స్వీకరణ, 10న అభ్యంతరాలపై సమీక్షించి 12న తుది జాబితా ప్రచురించనున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఉప సమరానికి అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఆయా జిల్లాల పరిధిలో ఖాళీ అయిన స్థానాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే ప్రచురించారు. ముసాయిదా జాబితాపై ఈనెల 8వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈనెల 10న అభ్యంతరాలపై సమీక్షిస్తారు.
ఈ నెల 12న ఫైనల్ ఓటరు లిస్టును ప్రకటిస్తారు. తుది జాబితా విడుదల అయిన తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
పాలమూరులో అత్యధికం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఏడు సర్పంచ్ స్థానాలకు 15 ఎంపీటీసీ స్థానాలకు 91 వార్డు స్థానాలకు ఈ జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జడ్చర్ల మండల పరిషత్ పాలకవర్గం గడువు గతేడాది మే 3తో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే కోర్టు కేసుల కారణంగా జడ్చర్ల మండల పరిషత్ పాలకమండలి గడువు మాత్రం 2020 మే 3న ముగిసింది.
దాదాపు ఏడాది కాలం నుంచి మండల పరిషత్కు పాలకమండలి లేదు. జడ్చర్ల మండల పరిషత్ పరిధిలోని 15 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించనున్నారు. కావేరమ్మపేటను జడ్చర్ల పురపాలికలో విలీనం చేయగా.. ఆ పంచాయతీ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన బండమీదిపల్లి, శంకరాయపల్లి తండా పంచాయతీలకు తాజాగా ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్చర్ల మండల పరిధిలోని బూర్గుపల్లి, గోప్లాపూర్, ఏదులబాయి తండా (మిడ్జిల్), హేమాజీపూర్ (బాలానగర్), సోమ్లా నాయక్ తండా (కోయిల్కొండ)లో సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగనున్నది.
నాగర్కర్నూల్లో నాలుగు..
నాగర్కర్నూల్ జిల్లా లోని మాచినేనిపల్లి (కొల్లాపూర్), కొండ్రావుపల్లి (కొడేరు), తిరుమలాపూర్ (ఉప్పునుంతల), ఎంజీ కాలనీ తండా (వెల్దండ) సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగనుంది. నాగర్ ర్నూల్లో మూడు ఎంపీటీసీ స్థానాలకు 32 వార్డు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. వనపర్తి జిల్లాలో వెంగలాయ పల్లి (పానగల్) బుగ్గ పల్లి తండా (పెద్దమందడి) కత్తేపల్లి (ఆత్మకూరు) గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగనున్నది. వనపర్తి లో రెండు ఎంపీటీసీ స్థానాలు 30 వార్డు స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని కర్నే, చేగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. పేటలో 30వ వార్డు స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరుగనున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇటిక్యాల మండలం షాబాద్ సర్పంచ్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. జిల్లాలో ఆరు ఎంపీటీసీ 28 వార్డు స్థానాలకు సైతం ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. పలుచోట్ల ఎంపీపీ స్థానాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఎంపీటీసీ ఎన్నికలను పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జడ్చర్ల ఎంపీపీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సర్వం సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్నది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాం. అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం తుది ముసాయిదా ప్రచురణ చేస్తాం. ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు సమకూర్చుకొని ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తున్నాం
ఇవి కూడా చదవండి
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు.. నలుగురి మృతి
ఎముకలు బలంగా కావాలా? ఇవి తినండి