సినీనటుడు సోనూసూద్ కార్పొరేషన్ సలహాదారుడిగా ట్విట్టర్లో ప్రకటన వేసి.. అమాకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాడిని శనివారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్, ముజఫర్పూర్ ప్రాంతానికి చెందిన అశీష్కుమార్ సింగ్.. తన పేరును పంకజ్ సింగ్ బహదూరియాగా మార్చుకుని ట్విట్టర్లో సోనూసూద్ కార్పొరేషన్ సలహాదారుడినంటూ ప్రకటన వేశాడు.. ఇది చూసి ఎవరైనా అతడిని సంప్రదిస్తే.. వారిని మాటలతో మా యచేస్తాడు. మీకు త్వరలో సాయం డబ్బులు అందుతాయని..మీరు అడిగిన దాని కంటే అధికంగా సోనూసూద్ కార్పొరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నమ్మించి.. పాసెసింగ్ చార్జీలు అంటూ డబ్బులు వసూలు చేస్తాడు. ఈ క్రమంలో సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ట్విట్టర్లో ఆ ప్రకటనను చూసి.. తనకు రూ.10 వేల సహాయం కావాలని అశీష్ కుమార్కు ఫోన్ చేశాడు.
ముందుగా మీ ఆధార్కార్డు, బ్యాంక్ వివరాలను ఇవ్వాలని చెప్పగా .. అలాగే ఇచ్చాడు.. ఆ తర్వాత అశీష్ ఫోన్చేసి మీ గురించి ఎంక్వైరీ చేశాం.. మీరు అడిగినదానికంటే.. అదనంగా రూ.50 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ ని చెప్పాడు.. అయితే.. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.8300 పంపాలని చెప్పగా.. అలాగే పంపించాడు.. రెండు రోజుల తర్వాత మళీ ఫోన్చేసి సోనూసూద్ కార్పొరేషన్ మీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించింది… మీకు మొత్తం రూ.3.6 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నమ్మించి… మొత్తం రూ.60 వేలు వసూలు చే శాడు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు బిహార్కు చెందిన అశీష్కుమార్ సింగ్ను అరెస్ట్ చేశారు.