హైదరాబాద్: పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో బుధవారం జరగనున్న ఈ సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ఫోర్స్ అధికారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సమగ్ర నివేదికలతో సమావేశానికి రావాలని ఎక్సైజ్ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరించనున్నారు. డ్రగ్స్ కట్టడికి కార్యాచరణపై అధికారులకు సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు.