KTR | హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారు. హైడ్రా అనే బ్లాక్మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి.. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఎక్కడ నా ఇల్లు కూలగొడుతారమోనని 52 ఏళ్ల బుచ్చమ్మ అనే మహిళ మూడు రోజులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల కుటుంబాన్ని చూస్తే బాధనిపిస్తోంది. ఎంతో కష్టపడి మా బిడ్డలకు ఉపయోగపడతదని ఇళ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆలోచన, ప్రణాళిక, పద్దతి లేకుండా చేశారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట. హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా..? ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా..? రేవంత్ రెడ్డి నీ అన్నకు మాత్రం ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా..? పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా? ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టవో ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లో మాత్రమే కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. హైడ్రాతో ఆర్థిక మంత్రికి ఏంటి సంబంధం. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఐదు మంది బిల్డర్ల పేరు చెబుతాడు. ఎందుకిదంతా బ్లాక్మెయిల్ దందానా? నీ మంత్రులు, నీ తమ్ముళ్లకు ఇదే దందానా? పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవటానినా నీ ప్రభుత్వం ఉన్నది. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
బుచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటాం. వారికి ఆర్థిక సాయం చేశాం. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీకు న్యాయ సాయం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. గరీబోళ్ల పొట్టకొట్టే ప్రభుత్వ చర్యలపై పోరాడుతాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. గరీబోళ్లకు మేము అండగా ఉంటాం. వారికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తోడుగా ఉంటారు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ, కసి పెంచుకుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనందరం తిరగబడాల్సిందే అని కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు.. హరీశ్రావు చురకలు
Harish Rao | నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు : హరీశ్రావు