KTR | నోరు జారితే ఎవరైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని.. కానీ కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారంటూ సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్పై ఆయన నిప్పులు చెరిగారు. మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా సీఎం నోరుపారేసుకున్నారన్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదని.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు.
మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. రేవంత్ సీఎం పదవికి అన్ఫిట్ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని.. ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అన్నారు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవారని.. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని.. బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయమన్నారు.
ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు భట్టి గారు అంటూ ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడామని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామని.. అది తమకు కేసీఆర్ నేర్పించిన సంస్కారమని తెలిపారు. అసెంబ్లీలో ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని.. ముఖ్యమంత్రి సిగ్గు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో అంటూ హితవు పలికారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.