KTR | హైదరాబాద్ : తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ.. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకు మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కు, బీహార్కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తోందన్నారు కేటీఆర్.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు.. సంతోషమే. కానీ ఆంధ్రప్రదేశ్, బీహార్కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు అని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
FM Nirmala Sitharaman: తగ్గనున్న బంగారం, వెండి, మొబైల్ ఫోన్ల ధరలు..
Income Tax | రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్.. కొత్తవిధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..