KTR | హైదరాబాద్ : సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మేఘా సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ – మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని కేటీఆర్ పేర్కొన్నారు. సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోంది. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే కదా అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారు. బ్లాక్లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును (Quid pro Quo) కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
TG Highcourt | రైతుల హక్కులను కాలరాయొద్దు.. శాంతియుత ఆందోళనలో పోలీసుల ప్రమేయం ఎందుకు?
Sunkisala | డాటాలోనూ తొండాట! ‘సుంకిశాల’ సమాచారానికి, దేశభద్రతకు ముడి
TGPSC | గ్రూప్స్ సిలబస్ మార్పు? ఇంటర్వ్యూ విధానంపైనా చర్చలు..!