KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గురుకుల భవనాలకు అద్దె చెల్లిస్తలేరు. కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు. కనీసం అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని కేటీఆర్ విమర్శించారు. చదువు పక్కనపెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వటానికి పైసలు లేవా? రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేదు. రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతోంది. ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులకు మేలు చేయటంలో లేదా? కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించినా, సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదా? వెంటనే రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించాలి. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | హైదరాబాద్కు మూడు వైపులా సముద్రం ఉన్నదట.. రేవంత్ వ్యాఖ్యలు
TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలో నాలుగు రోజుల వానగండం..!
Jagga Reddy | రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించిన జగ్గారెడ్డి.. వన్యప్రాణి సంరక్షకులు ఫైర్