TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లోని సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. మరో వైపు రాగల నాలుగురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలవైపుగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేసింది.
మంగళవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. గురువారం రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.