– నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్
– నల్లగొండ కోర్టు ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్
రామగిరి, జూలై 23 : న్యాయవాదులు, న్యాయవాద సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్ అన్నారు. గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్.ఎల్. హాస్పిటల్ సహకారంతో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేటి సమాజంలో పర్యావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో సంపాదనలో దాదాపు 25 శాతం వైద్యానికే ఖర్చు చేయాల్సి వస్తోందని, వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మేలని సూచించారు.
న్యాయవాదులు నిరంతరం మానసిక ఒత్తిడి, కోర్టు కార్యకలాపాల్లో తీరికలేని జీవనం గడపడం వల్ల బిపి, మధుమేహం, గుండె, వెన్నునొప్పి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇటువంటి హెల్త్ క్యాంపుల ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందే వీలుంటుందన్నారు. ఆరోగ్యవంతమైన న్యాయవాది సమాజానికి మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని పేర్కొన్నారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్, ఆర్.ఎల్. హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కవిత, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తమరావు, మున్సిఫ్ జడ్జీలు హిమబిందు, సాయి సేరణ్ తేజ, మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకవరపు సతీష్ కుమార్, బచ్చనబోయిన అశోక్ కుమార్, ఉపాధ్యక్షురాలు నూకల సంధ్యారాణితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు జనిగల రాములు, పులిజాల కార్తీక్, పందుల సైదులు, మల్లేపల్లి ఆదిరెడ్డి, వి.సురేందర్ రెడ్డి, నాంపల్లి నరసింహ, చక్రవర్తి, కె.యాదయ్య పాల్గొన్నారు.

‘వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మేలు’