రాజాపేట: ఆ ఊరిలో ధూంధాంగా జరుపుకునే అతి పెద్ద పండుగ పీర్ల పండుగ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదర భావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంత ఘనంగా జరుపుకునే మోహర్రం పండుగ రాజాపేట మండలంలోని పాముకుంటలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ గ్రామంలో ఇంత వైభవంగా నిర్వహించే పండుగను చూడడానికి చుట్టు పక్కల గ్రామస్తులకే కాకుండా బంధువులు సైతం పెద్దగా వస్తుంటారు. దీంతో గ్రామంలో వారం రోజుల పాటు పండుగ వాతా వరణం నెలకొంటుంది.
ప్రతి ఏటా ఆనవాయితీగా…
గ్రామంలో పెద్దగా ముస్లిం కులస్తులు పెద్దగా లేకపోయినప్పటికీ పీర్ల పండగను కులమతాలకు అతీతంగా గ్రామస్తులు నేటికి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆనావాయితీగా గ్రామస్తులంతా ఏకమై గ్రామ నడిబొడ్డున ఉన్న పీర్ల కొట్టంలో మండలంలో ఎక్కడా లేని విధంగా 12 పీర్లను ప్రతిష్ఠిస్తారు. మోహర్రం మాసంలో పుణ్యం కలుగాలని కోరుకుంటూ కొత్తమంది భక్తులు పది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు.
గ్రామస్తులంతా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు రాత్రి వేళలలో డప్పు దరువులు, జానపద గేయాలు పాడుతూ అలువా ఆటను ఆడుతారు. ఆలువా ఆటను చూడడానికి ఊరి జనమంతా తరలివచ్చి గంటల తర బడి ఆసక్తిగా తిలకిస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య పీర్లను ఊరేగింపుగా ఇంటింటికీ తిరుగగా ఊదు, దట్టీలు, మలీద ముద్దలు, బెల్లం, కానుకలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామ ప్రధాన వీధుల్లో మేళ తాళాల మధ్య పీర్లను ఊరేగించి సమీప చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమం రోజున ఏలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కులమతాలకు అతీతంగా జనజాతరలా కొనసాగుతుంది.