వికారాబాద్ : గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్ పూర్, రాఘవపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోనే 60 శాతం తెలంగాణలో వరి సాగు జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,028 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో గత సంవత్సరం 29,584 ఎకరాల్లో వరి సాగు జరుగగా..ఈ సంవత్సరం 69,667 ఎకరాల్లో వరి సాగు చేశారని వివరాలను వెల్లడించారు.
మొత్తం జిల్లాలో 191 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తూకాల వద్ద పకడ్బందీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నారు.
సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.
కొనుగోలు పూర్తయ్యాక మళ్లీ తరుగు తీయవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం