వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని మందులు, ఆక్సిజన్ తదితర ఇతర వైద్య పరికరాలను అందించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలుసు కదా. అయితే ఈ లిస్ట్లో వ్యాక్సిన్లు లేకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా దగ్గర కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులు అవసరానికి మించి ఉన్నాయని, వాటిని ఇండియాలాంటి దేశాలకు ఇవ్వాలని ఇండియన్ అమెరికన్లతోపాటు యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా బైడెన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అయితే ఇండియా అసలు తమను వాడటానికి సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్లు అడగనే లేదని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్లు అడగలేదని అమెరికా వైస్హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ వెల్లడించారు. నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు మా దగ్గర ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు అసలు లేనే లేవు అని ఆమె స్పష్టం చేశారు. సాకీ ప్రెస్ బ్రీఫ్లో చాలా వరకు ఇండియాకు సంబంధించిన ప్రశ్నలకే సమాధానాలు చెప్పారు.
రానున్న వారాల్లో ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి ఇస్తే కోటి డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రిలీజ్ కానున్నట్లు ఆమె తెలిపారు. మరో 5 కోట్ల డోసులు మే, జూన్ నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇండియా సహా ప్రపంచ దేశాలకు ఉన్న కొవిడ్ అవసరాలపై వైట్హౌజ్ కొవిడ్ టీమ్, నేషనల్ సెక్యూరిటీ టీమ్స్ పని చేస్తున్నాయని వెల్లడించారు.
ఇండియాలో వ్యాక్సిన్ల కొరత ఉన్నా కూడా వాటిని అడగకుండా కేవలం ఆక్సిజన్, దాని సంబంధిత సరఫరాలు, ఇతర అత్యవసర మందులు ఇవ్వాలని అమెరికాను అడిగినట్లు యూఎస్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు చెప్పారు. ఇక రెమ్డెసివిర్ ఇంజక్షన్లను తయారు చేస్తున్న అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్.. ఇండియాకు నాలుగున్నర లక్షల వయల్స్ను విరాళంగా ఇస్తుండటం విశేషం.