మెల్బోర్న్: ఇండియా నుంచి వచ్చే విమానాలను నిషేధించిన జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్న ఇతర దేశాలు ఇండియా నుంచి ప్రయాణికులను తమ దేశాల్లోకి అనుమతించడం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మే 15వ తేదీ వరకూ ఇండియా నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ఇండియా నుంచి స్పష్టంగా వైరస్ ముప్పు పొంచి ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లతోపాటు కొన్ని వేల మంది ఆ దేశస్థులు ఇండియాలోనే చిక్కుకుపోనున్నారు. మొదటి నుంచీ ఈ నిర్ణయం వెలువడుతుందనే ఆందోళనతోనే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు ఇంటికి వెళ్లిపోగా.. వార్నర్, స్మిత్ సహా మిగిలిన వాళ్లు కూడా వెళ్లిపోతారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడీ నిషేధంతో కనీసం మే 15 వరకైనా వారికి ఆ అవకాశం లేకుండా పోయింది.