గత రెండు సిరీస్ల్లో తొలి మ్యాచ్లు ఓడి ఆ తర్వాత దుమ్మురేపిన టీమ్ఇండియా.. వన్డేల విషయానికి వచ్చేసరికి మొదటి మ్యాచ్లోనే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తుచేసింది.శిఖర్ ధావన్ సూపర్ ఇన్నింగ్స్కు కృనాల్ పాండ్యా, లోకేశ్ రాహుల్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన కోహ్లీసేన.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బోణీ కొట్టింది. బెయిర్స్టో ఉన్నంతవరకు భయపెట్టినా.. అరంగేట్ర పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.
పుణె: బ్యాట్స్మెన్ పోరాటానికి.. బౌలర్ల సంయమనం.. ఫీల్డర్ల సహకారం జతవడంతో వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం ఎమ్సీఏ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది. ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా.. రాహుల్ (43 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కృనాల్ (31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (56) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) బెంబేలెత్తించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టారు. ధావన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడే రెండో వన్డే జరుగనుంది.
ఇరు జట్లలోనూ అన్నదమ్ములు
ఈ మ్యాచ్లో ఇరు జట్లలోనూ అన్నదమ్ములు కలిసి ఆడారు. భారత్ తరఫున కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా బరిలో దిగితే.. ఇంగ్లండ్ తరఫున టామ్ కరన్, సామ్ కరన్ కలిసి ఆడారు. కృనాల్, హార్దిక్ జంట టీమ్ఇండియా తరఫున వన్డేలాడిన మూడో బ్రదర్స్ జోడీగా నిలిచింది. గతంలో మొహిందర్ అమర్నాథ్, సురిందర్ అమర్నాథ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ జాతీయ జట్టు తరఫున ఆడారు.
కృనాల్, కృష్ణ అరంగేట్రం
ఈ మ్యాచ్లో భారత్ తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేశారు. ఆట ఆరంభానికి ముందు హార్దిక్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న కృనాల్.. అర్ధశతకం చేశాక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటీవల మరణించిన తండ్రికి తన ఇన్నింగ్స్ను అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు.
శ్రేయస్కు గాయం
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా భారత మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన అతడి ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 28, ధావన్ (సి) మోర్గాన్ (బి) స్టోక్స్ 98, కోహ్లీ (సి) అలీ (బి) వుడ్ 56, శ్రేయస్ (సి) (సబ్) లివింగ్స్టోన్ (బి) వుడ్ 6, రాహుల్ (నాటౌట్) 62, హార్దిక్ (సి) బెయిర్స్టో (బి) స్టోక్స్ 1, కృనాల్ (నాటౌట్) 58, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 317/5. వికెట్ల పతనం: 1-64, 2-169, 3-187, 4-197, 5-205, బౌలింగ్: వుడ్ 10-1-75-2, సామ్ కరన్ 10-1-48-0, టామ్ కరన్ 10-0-63-0, స్టోక్స్ 8-1-34-3, రషీద్ 9-0-66-0, మొయిన్ 3-0-28-0.
ఇంగ్లండ్: రాయ్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) కృష్ణ 46, బెయిర్స్టో (సి) కుల్దీప్ (బి) శార్దూల్ 94, స్టోక్స్ (సి) (సబ్) గిల్ (బి) కృష్ణ 1, మోర్గాన్ (సి) రాహుల్ (బి) శార్దూల్ 22, బట్లర్ (ఎల్బీ) శార్దూల్ 2, బిల్లింగ్స్ (సి) కోహ్లీ (బి) కృష్ణ 18, అలీ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 30, సామ్ కరన్ (సి) (సబ్) గిల్ (బి) కృనాల్ 12, టామ్ కరన్ (సి) భువనేశ్వర్ (బి) కృష్ణ 11, రషీద్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0, వుడ్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 13, మొత్తం: 251. వికెట్ల పతనం: 1-135, 2-137, 3-169, 4-175, 5-176, 6-217, 7-237, 8-239, 9-241, 10-251, బౌలింగ్: భువనేశ్వర్ 9-0-30-2, కృష్ణ 8.1-1-54-4, శార్దూల్ 6-0-37-3, కృనాల్ 10-0-59-1, కుల్దీప్ 9-0-68-0.