Jay Shah : భారత క్రికెట్లో ప్రకంపనలు రేపిన సెంట్రల్ కాంట్రాక్ట్ వివాదంపై బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) తొలిసారి స్పందించాడు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), ఇషాన్ కిషన్(Ishan Kishan)లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడంలో తన ప్రమేయం లేదని, అదంతా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) పనేనని స్పష్టం చేశాడు.
సెలెక్టర్లు చెప్పినదాన్నిఅమలు చేయడమే నా నా బాధ్యత. అయ్యర్, ఇషాన్ స్థానంలో చీఫ్ సెలెక్టర్ కొత్త ఆటగాళ్ల పేర్లను సూచించారు. ఉదాహరణకు సంజూ శాంసన్. అప్పుడప్పుడు ఇది అనివార్యం కూడా అని షా తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్ 2023 ఎడిషన్లో ప్రవేశపెట్టిన ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) నియమంపై కూడా పునరాలోచిస్తామని షా వెల్లడించాడు. ఈ నియమంపై కూలంకషంగా చర్చించి.. ఒక నిర్ణయానికి వస్తామని సెక్రటరీ చెప్పాడు.
దేశవాళీ క్రికెట్లో ఆడాలనే బీసీసీఐ నిబంధనను శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు పెడచెవిన పెట్టారు. దాంతో, ఇద్దరికీ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వీళ్ల పేర్లను తొలగించారు. ఇంగ్లండ్ సిరీస్లో అదరగొట్టిన కుర్రాళ్లు ధ్రువ్ జురెల్(Dhruv Jurel), సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)లకు తొలిసారి కాంట్రాక్ట్లో చోటు కల్పించారు. అయితే.. గాయం తర్వాత దేశవాళీలో ఆడని హార్దిక్ పాండ్యాపై మాత్రం బీసీసీఐ వేటు వేయలేదు. దాంతో, భారత క్రికెట్ బోర్డు రెండు నాల్కల ధోరణిపై మాజీ క్రికెటర్లు ఓ రేంజ్లో మండిపడ్డారు.