ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) .. తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కొత్త కోచ్ను వెతుక్కునేందుకు బీసీసీఐ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ వాణిజ్య ప్రకటనను కూడా తయారు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా కన్ఫర్మ్ చేశారు. 2021 నవంబర్ నుంచి టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్నాడు. 2023 వన్డే వరల్డ్కప్ తర్వాత అతని కాంట్రాక్టును పొడిగించారు. అయితే ద్రావిడ్కు ఎటువంటి పొడిగింపు ఈసారి ఇవ్వడం లేదని బోర్డు స్పష్టం చేస్తోంది. త్వరలోనే కొత్త కోచ్ కోసం బోర్డు ఓ యాడ్ను రిలీజ్ చేయనున్నది.
ద్రావిడ్ హెడ్ కోచ్ బాధ్యతలు ఈ జూన్తో ముగియనున్నది. ఆ సమయంలో టీమిండియా జట్టు టీ20 వరల్డ్కప్ ఆడుతుంటుంది. నవంబర్ 2023లో హెడ్ కోచ్గా పొడిగింపు తీసుకున్నాడు. జూన్ 2024 వరకు ఆ కాంట్రాక్టు అందుబాటులో ఉంటుంది. కావాలనుకుంటే రాహుల్ ద్రావిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు అని, కానీ ఆటోమెటిక్గా పొడిగింపు ఉండదని జే షా స్పష్టం చేశారు. కొత్తగా రాబోయే కోచ్ విదేశీ వ్యక్తి అయి ఉంటాడా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. భారతీయుడైనా కావచ్చు లేదా విదేశీయుడైనా కావచ్చు అని ఆయన అన్నారు.
వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమించే విధానాన్ని షా కొట్టిపారేశారు. దీనిపై సీఏసీ నిర్ణయం తీసుకుంటుందని, అన్ని రకాల ఫార్మాట్లు ఆడే ప్లేయర్లు ఉన్నారని, ఇండియాకు ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఈ అంశాన్ని ఓనర్లతో మాట్లాడి వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.