న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ భారత్లో కొనసాగుతుండగా.. టీకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం వంద రోజుకు చేరింది. ఇప్పటి వరకు 14.19 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. 20,44,954 సెషన్లలో 14,19,11,223 వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో 92,98,092 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 60,08,236 మందికి రెండో డోసు వేశామని చెప్పింది. 1,19,87,192 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి మోతాదు, 63,10,273 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.
అలాగే 60 ఏళ్లు పైబడిన 4,98,72,209 మందికి ఫ్టస్ డోస్, మరో 79,23,295 మందికి రెండో డోస్ అందించినట్లు చెప్పింది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న వ్యక్తుల్లో 4,81,08,293 మంది లబ్ధిదారులకు మొదటి, 24,03,633 మందికి రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళలో టీకాల పంపిణీ 58.7 శాతం ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 10 లక్షల మోతాదులను వేసినట్లు వివరించింది.