బహిరంగ మల విసర్జన వద్దంటూ విన్నపం
పెద్దల్లో పరివర్తనకు చిన్నారుల కృషి
శంకరపట్నం, ఏప్రిల్ 9 : అవును.. ఆ ఊరిలో చిట్టి చేతులు ఒక్కటయ్యాయి.. బహిరంగ మలవిసర్జన వద్దంటూ సమరం చేస్తున్నాయి.. సుతి మెత్తగా పెద్దల్లో పరివర్తనకు కృషి చేస్తున్నాయి.. ఫలితంగా పెద్దలు ఆ చెరువు కట్ట వైపు వెళ్లడం మానేశారు.. దీనికి నిదర్శనమే శంకరపట్నం మండలం ముత్తారం. ఈ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మోడల్ విలేజ్. స్వచ్ఛతకు మారు పేరు.. కాకపోతే ఆ ఊళ్లో కొందరు పురుషులు మాత్రం గ్రామ పరిధిలోని రామసముద్రం చెరువు కట్ట వైపు వెళ్లడం మానడం లేదు. ఫలితంగా కట్ట, మత్తడి, తదితర పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఎన్నో మంచి లక్షణాలున్న ఊరిలో ఈ ఒక్క అవ లక్షణాన్ని మార్చాలనుకున్నారు చిన్నారులు. దాదాపు 20 మంది ముందుకు రాగా, వారికి సర్పంచ్ పంజాల రేణుక ఆధ్వర్యంలో ఎస్బీఎం కన్సల్టెంట్ రమేశ్, పంచాయతీ కార్యదర్శి జీవిత శిక్షణ ఇచ్చారు. ‘ఇచట మల విసర్జన చేయరాదు’ అని పంచాయతీ పాలకవర్గం చెరువు కట్ట వద్ద బోర్డులు ఏర్పాటు చేయించింది. ఇక ఆ చిన్నారులు తమ పనిని ఆరంభించారు. ఈనెల 8 నుంచి వేకువజామున నిద్ర లేవడంతోనే సమూహంగా వస్తున్నారు. చెరువు కట్టవైపు వెళ్లకుండా దారికి అడ్డంగా నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిలబడుతున్నారు. ఆ దారిన వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల పట్టుదలతో పెద్దల్లో పరివర్తన వస్తోంది. తెల్లవారుజామున చెరువు కట్ట వైపు పడే అడుగులు ఆగిపోయాయి. ఇంట్లోని మరుగుదొడ్లనే వాడుతున్నారు. చిన్నారుల ఆశయం పలువురిని ముగ్దులను చేస్తుండగా, తమ ఊరిని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడంలో పోషిస్తున్న పాత్రను కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కొత్తగా 4 కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటు
17 గంటలకో బిలియనీర్.. టాప్లో జెఫ్ బెజోస్