SP Narasimha | పౌరులు ఇచ్చిన ఫిర్యాదులపై పారదర్శకతతో, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సత్వరమే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి క్రయ విక్రయాలు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కోదాడ పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న నేరస్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు పాత నేరస్తులకు నెలవారీ కౌన్సెలింగ్ కూడా చేపట్టాలన్నారు. యువత విద్యార్థులు గంజాయి తదితర మాదకద్రవ్యాల బారిన పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను ఆయన గుర్తుచేశారు. రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిగ్నల్ వ్యవస్థను సజావుగా కొనసాగించాలన్నారు. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు… శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్లను డిస్మెంటల్ చేసేందుకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట డీఎస్పి శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ శివ శంకర్ నాయక్, ఎస్సైలు ఉన్నారు.