AP News : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదన ‘మావిగన్’ పై ఆ రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాటలు నిలకడలేకుండా ఉన్నాయని, వాటిని పిచ్చెక్కిన మాటలు అంటారని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్ తీరుపై ఘాటుగా స్పందించారు. తల్లిని, చెల్లిని గెంటేసి.. సొంత చిన్నాన్న హత్య కేసులోని నిందితులపై చర్యలు తీసుకోని వ్యక్తిని మనుషుల జాబితాలో చేర్చలేమని అన్నారు.
విశాఖను రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే ఓట్లు వేయలేదని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి జగన్ మాటలను ప్రజలు ఎంతమాత్రం నమ్మడం లేదనే విషయం స్పష్టమైందని ఆమె తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స, ధర్మాన వంటి సీనియర్ నేతలు పార్టీలో ఉన్నప్పటికీ, జగన్ నిలకడలేని మాటల వల్ల జరిగే నష్టాన్ని ఎందుకు వివరించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు.
జగన్ తన పేరులో గన్ ఉన్నట్టే రాజధాని పేరులోనూ గన్లు, గొడ్డళ్లు ఉండాలనుకుంటున్నాడని, ఆయనకు మానవ సంబంధాలతో పనిలేదని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చినా జగన్కు బుద్ధి రాలేదని, ఇదే మేనిఫెస్టోతో మళ్లీ ప్రజల ముందుకు వెళితే ఆ 11 సీట్లు కూడా మిగలవని ఆమె జోస్యం చెప్పారు.