“కరుప్పు’ నుంచి సూర్య కొత్త ప్రయాణం మొదలైంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ ప్రయాణం మరింత శోభను సంతరించుకున్నది. లేడీస్ ఎక్కువగా ఇష్టపడే హీరో సూర్య. నాకు తెలిసి సూర్య, మహేశ్ ఇద్దరికీ వయసు వెనక్కెళ్తుందేమో అనిపిస్తుంది. ‘గజనీ’లోని సంజయ్ రామస్వామి తెలుగువారు బాగా ఇష్టపడే పాత్ర. ఆ పాత్ర విషయంలో సూర్యను మ్యాచ్ చేయలేకపోయానని అమీర్ఖానే స్వయంగా చెప్పారు. మళ్లీ ఈ సినిమాలో సంజయ్ రామస్వామి గుర్తొచ్చాడు. సూర్య, మమితా, రాధిక, రవీనా.. ఈ నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. సూర్య సినిమా ప్రొడక్షన్లో మా పేరూ ఉన్నందుకు ఆనందంగా ఉంది.
సూర్య సినిమాకు దర్శకుడిగా నా పేరు పడ్డప్పుడు ఇంకా ఆనందిస్తా. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేదు. కచ్చితంగా చెబుతాను’ అని అతిథిగా విచ్చేసిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. సూర్య కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితాబైజు కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది.
శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో త్రివిక్రమ్ మాట్లాడారు. హీరో సూర్య మాట్లాడుతూ ‘గొప్ప జ్ఞాపకాలనిచ్చిన సినిమా ఇది. నేను తమిళుడ్ని. మమిత మలయాళీ, రవీనా మహరాష్ట్రీయన్.. వివిధ భాషల్లోని నటులు పనిచేసిన ఈ సినిమాను సొంత సినిమాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల ప్రేమను జీవితంలో మరిచిపోలేను. దర్శకుడు వెంకీ రైటింగ్కి హ్యాట్సాఫ్. వసూళ్లు పెరుగుతున్నాయి. అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వస్తున్నది. ముఖ్యంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.