PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆగష్టు 10, సోమవారం నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లులకు మద్దతు ఇచ్చేందుకు పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ సిద్ధమైంది. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నామని శనివారం అధికారికంగా ప్రకటించింది.
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. శనివారం పార్టీ అగ్రనేతలతో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకుముందు.. శుక్రవారం ఆయన ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. మహిళా సాధికారతకు, గౌరవానికి సంబంధించి సిక్కు గురువులు నేర్పిన పాఠాలు తమకు స్ఫూర్తి అని ఆ పార్టీ ప్రకటించింది. ఇదే సమయంలో డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతు తెలిపింది. అయితే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా నియోజకవర్గాల విభజన జరగాలని కోరింది. డీ లిమిటేషన్ బిల్లు ద్వారా ప్రస్తుతం అన్ని సభల్లో ఉన్న ప్రజాప్రతినిధుల శాతాన్ని అదనంగా 50 శాతం పెంచనుంది. ఈ నేపథ్యంలో వెంటనే డీలిమిటేషన్తోపాటు, మహిళా బిల్లు అమలు జరగాలని శిరోమణి అకాలిదళ్ కోరుతోంది.
ప్రధాని మోదీని.. సుక్బీర్ ఢిల్లీలో కలవడం.. అనంతరం ఈ ప్రకటన రావడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. పంజాబ్లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలిదళ్ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా ఈ పార్టీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే, 2020లో కూటమి నుంచి బయటకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న రెండు కీలక బిల్లులకు ఈ పార్టీ మద్దతు ఇవ్వడం ఎన్డీయే ప్రభుత్వానికి బలంగా మారనుంది.