సూర్యాపేట, సెప్టెంబర్ 15 : రైతుల కోసం ఏది అడిగినా ప్రభుత్వం ఎల్నినో పేరు చెబుతుంది. తెలంగాణకు పట్టింది ఎల్నినో కాదని అది కాంగ్రెస్ దెయ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణా, గోదావరి జలాలు వచ్చినవి. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు ఆన్ చేసినా కూడా నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుండి సాగర్కు నీళ్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 11,000 క్యూసెక్కుల నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే ఇస్తుందన్నారు. రైతులు పంటలు వేయాలా వద్దా అని అడిగితే ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు. ఎస్ఎల్బీసీ, సాగర్ నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఐదు పంటలకు నీళ్లు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాగర్ 526 అడుగుల నీరు ఉన్నప్పుడే కేసీఆర్ నీరు ఇచ్చాడని, ప్రస్తుతం 536 ఉన్నా నీరవ్వడం లేదని దుయ్యబట్టారు.
ఆంధ్రా వాళ్లు నీళ్లను దోచుకెళ్తుంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మా నీళ్లు దోచుకుపోవద్దని.. మా రైతులకు అన్యాయం చేయవద్దని కేఆఆర్ఎంబీకి లేఖ రాయడం లేదన్నారు. రైతులు పంటలు పండిస్తే, ప్రకృతి సహకరిస్తే ఎరువులు ఇవ్వాల్సి వస్తుందని, ఎక్కువ నీరు ఇవ్వాల్సి వస్తుందని, బోర్లలో నీరు చేరితే 24 గంటల కరెంటు డిమాండ్ పెరుగుతుందని, అప్పుడు పంట పండితే ఐకెపి సెంటర్లకు వస్తారని, ధాన్యం కొనాల్సి వస్తుందని, ధాన్యం కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మొదలే ఎగవేస్తే ఇవన్నీ ఉండవని రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లాపట్టి నిలబెట్టి రెండు పంటలకు రైతులకు నీళ్లు తెస్తామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఇలాగే చేస్తే కేసీఆర్ పాదయాత్ర చేసి నీళ్లు తెచ్చాడన్నారు. ఇటీవల సభలో కేటీఆర్ కూడా నీళ్లు ఇవ్వకుంటే పాదయాత్రగా సాగర్కు వెళ్లి నీళ్లు తెచ్చుకుందామన్నట్లు తెలిపారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని, రైతుల పంట చేతికొచ్చేంత వరకు నీళ్లు వచ్చేలా పాదయాత్ర చేసి నీళ్లను విడిపించుకుని పొలాలను బతికించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.