Online Games | కొవిడ్ దెబ్బకు ఇండియాలో ఆన్లైన్ ఆటలకు బూమ్ వచ్చింది. ఆడేవాళ్లే కాదు ఆటలు అభివృద్ధి చేసే కంపెనీలు కూడా జోష్ మీదున్నాయి. గేమ్ల డౌన్లోడ్ ఎలా పెరిగిందో… కంపెనీల ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరిగింది. ఈ ఆటల్లో ఎన్ని రకాలో.. అన్ని లాభాలూ! అంతకు రెట్టింపు సమస్యలు.. సమయం, డబ్బు, చదువు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ ఆన్లైన్ ఆటల్లో కలిసిపోతున్నాయ్! ఆన్లైన్ గేమ్ ఆడనివాళ్లే తక్కువైపోతున్న రోజుల్లో ఈ ఆటల సంగతి తేల్చాలని ప్రభుత్వాలు చట్టాలకు పదునుపెడుతున్నాయ్. చట్టాలకు అతీతం కాని ఆటలు కోర్టులకెక్కితే.. ఆడేవాళ్ల్లు అప్పులు చేసో, మోసాలు చేసో వార్తలకెక్కుతున్నారు. ‘ఇట్లుంటది మనతోని’ అంటున్న ఆన్లైన్ గేమ్ అసలైన ఆట ఇప్పుడు మొదలైంది!
‘నాకు ఉద్యోగం అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తా’ అంటూ ఓ గృహిణి ధీమాగా చెప్పే ప్రకటన ప్రైమ్టైమ్లో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది. ఆ కమర్షియల్ యాడ్ ప్రభావం ఓ కుటుంబం మీదా పడింది. హైదరాబాద్లో ఉంటున్న ఓ ఇల్లాలు పక్కింటివాళ్ల దగ్గర రెండున్నర లక్షలు అప్పు చేసింది. ఈ అప్పెందుకు చేశావని భర్త గొడవపడితే.. అసలు విషయం బయటపడ్డది. ఆన్లైన్ రమ్మీ ఆడి ఒక్కరోజులోనే లక్షన్నర పోగొట్టింది. ఆడితే డబ్బులు వస్తాయని చెప్పిన పక్కింటామే వడ్డీకి అప్పు ఇచ్చింది!
హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. నిద్ర రాకుండా ఉండటం కోసం ఆన్లైన్లో తీన్పత్తి ఆడటం మొదలుపెట్టాడు. వారం రోజుల్లో ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు. అయినా అక్కడితో ఆగకుండా.. ఫ్రెండ్స్ దగ్గర నాలుగు లక్షల రూపాయలు అప్పుచేశాడు. ఇంట్లో వాళ్లకు తెలిసి క్లాస్ తీసుకున్నారు.
ఒక డ్రైవర్కు కరోనా వచ్చింది. హాస్పిటల్లో చేరాడు. కొడుకు దగ్గర ఫోన్ పెట్టాడు. రోజంతా ఏం చేయాలో తోచక ఆన్లైన్ గేమ్ మొదలుపెట్టాడు ఆ పిల్లగాడు. హాస్పిటల్ బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సున్నా. ‘మూడున్నర లక్షలు ఎలా మాయం అయ్యాయి?’ అని నిలదీస్తే.. ఆన్లైన్ గేమ్స్లో పోగొట్టానని ఒప్పుకొన్నాడు.
ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిపోయే దశ నుంచి ఆ ఆటలకు బానిసలుగా మారే పరిస్థితి వస్తున్నది. ప్రపంచానికంతా కీడు తలపెట్టిన కొవిడ్.. ఆన్లైన్ గేమ్లకు మాత్రం మంచే చేసింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ వల్ల.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం కావడంతో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇంటర్నెట్ డేటా ప్లాన్లు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలే ‘ఆన్లైన్ గేమింగ్ బూమ్’ సృష్టించాయి. కొత్తకొత్త ఆటగాళ్లు వర్చువల్ గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. జనానికి కాలక్షేపంతో పాటు, ఆనందమూ దొరికింది. పెరిగిన యూజర్లతో కంపెనీలకూ పండుగే! మొదటి లాక్ డౌన్.. ఏప్రిల్ 2020లో దేశంలో 783 మిలియన్ల గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. ఇది ప్రపంచంలోని మొత్తం డౌన్లోడ్స్లో 16.6 శాతం. ఈ పరిణామంతో భారతదేశం గేమింగ్ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్కెట్గా ఎదగబోతున్నదని ప్రపంచం గుర్తించింది. భారతీయ గేమింగ్ పరిశ్రమ వచ్చే మూడేండ్లలో 113 శాతం పెరుగుతుందనీ, వినియోగదారుల సంఖ్య 51 శాతం అధికం అవుతుందనీ అంచనా. ఫాంటసీ స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టిన ఓ అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ‘మీరు భారతదేశంలోని ఫాంటసీ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయకపోతే వ్యాపారంలో గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. గేమింగ్ రంగంలో వచ్చిన బూమ్తోపాటు, ఆ తర్వాత కాలంలో కొనసాగనున్న వృద్ధి బంగారు భవిష్యత్కు ఓ భరోసా’ అని అన్నాడంటేనే గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్ను అంచనా వేయవచ్చు.
భారత్లో నలభై కోట్ల మంది ఆన్లైన్ గేమ్ ఆడతారని అంచనా. కొవిడ్ తర్వాత మనదేశంలో ఆన్లైన్ గేమ్లకు మరింత ఆదరణ పెరిగింది. భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో చైనా ఉంది. కొవిడ్ మహమ్మారి కాలంలో భారత్లో ఆన్లైన్ గేమర్స్ పెరగడంతోపాటు ఆన్లైన్లో గేమ్ ఆడే సమయం కూడా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న గేమ్లలో భారతీయ గేమింగ్ యాప్ ‘లూడో కింగ్’ అగ్రస్థానంలో నిలిచింది. హౌజట్ ఫాంటసీ క్రికెట్ రెండో స్థానం సాధించింది. తీన్ పత్తి ఆరో స్థానంలో ఉంది. ఉచితంగా (వాణిజ్య ప్రకటనలతో) ఆడే జాయిన్ క్లాష్ 3డీ, రియల్ క్రికెట్ లాంటివి పేదలను, పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటే.. ఒక్కసారి యాప్ను కొనుగోలు చేసి.. ఉచితంగా ఆడుకునే తీన్ పత్తి, క్లాష్ ఆఫ్ క్లాన్స్, ఫ్రీ ఫైర్ తదితర ఆటలు మరింతగా రక్తి కట్టిస్తున్నాయి.
ఒకప్పుడు ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ టైమ్ను తగ్గించుకునేవారు. కానీ లాక్డౌన్ విధించాక డేటా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుని, స్క్రీన్ టైమ్ పెంచుకున్నారు. కొవిడ్కు ముందు గేమింగ్ టెక్నాలజీ కంపెనీలు ఆటగాళ్లను ఆకట్టుకోవడానికి చకచకా పూర్తయిపోయే ఆటలను రూపొందించేవి. కానీ, కొవిడ్ తర్వాత పరిస్థితి మారింది. ఎక్కువ సమయం ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. గేమర్స్ ఆలోచనకు తగినట్టే.. యాప్స్, ఆన్లైన్ గేమ్స్ను అందుబాటులోకి తెస్తున్నాయి గేమింగ్ సంస్థలు. ఇండియన్ గేమ్ డెవలపర్స్ గేమ్షన్, రిలయన్స్ గేమ్స్, జెట్ సింథసిస్ సంస్థలు భారతీయుల అభిరుచులకు తగినట్టుగా ఆన్లైన్ గేమ్స్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కంపెనీ రూపొందించిన లూడో కింగ్, సచిన్ సాగా, క్రికెట్ చాంపియన్షిప్, చోటా భీమ్, జంగిల్ రన్ మొదలైన గేమ్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ‘హౌస్ ఆఫ్ గేమింగ్’కు ఇప్పుడు 1.5 లక్షల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. మొదటిసారి మార్చి 2020లో లాక్ డౌన్ అప్పుడు ఈ ఆట నిడివి ఒకటిన్నర గంటలు. ఏప్రిల్ నెలలోనే సగటు సమయం ఏకంగా నాలుగు గంటల ఆరు నిమిషాలకు పెరిగింది. మళ్లీ జూన్లో లాక్డౌన్ ఎత్తేసి కార్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభమైన తర్వాత సగటు సమయం ఒక గంట తగ్గింది. కొవిడ్ మహమ్మారి ప్రభావం, లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్.. తదితర కారణాలు ఆన్లైన్ గేమ్స్పై ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్ని గేమింగ్ కంపెనీలు చాలా త్వరగా క్యాష్ చేసుకున్నాయి.
మొదట్లో అందరూ కాసేపు ఆడిపోదామనుకునే క్యాజువల్ గేమర్సే. లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆట సమయాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ప్రీమియర్ దాకా వచ్చి డబ్బు చెల్లించడానికైనా, పందెం కాయడానికైనా సిద్ధపడతారు. హార్డ్ కోర్ గేమర్స్గా అప్గ్రేడ్ అవుతారు. ఇదో మహా వ్యసనం. అంటుకుంటే వదలదు. దీనివల్ల ఉద్యోగానికి, వ్యాపారానికి ఆటంకమని అనుకుంటామా? కానీ, కొంతమంది ఇ-స్పోర్ట్స్నే వృత్తిగా ఎంచుకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఆటగాళ్ల అభిరుచులకు తగ్గట్టే గేమింగ్ కంపెనీలు డోస్ పెంచుతున్నాయి. రారమ్మని ఊరిస్తున్నాయి. దీంతో పాయింట్ల కోసమే కాదు, ప్రైజ్ మనీ కోసమూ మళ్లీ మళ్లీ ఆడుతున్నారు. ఇంకా ఇంకా పోగొట్టుకుంటున్నారు. డబ్బు పోతే పోయింది, ఆట టెక్నిక్ తెలిసిందని మురిసిపోతున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు.. మళ్లీమళ్లీ పందెం వేస్తున్నారు. దీనివల్ల వచ్చేది తక్కువే కానీ, చేజార్చుకునేది మాత్రం ఎక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతీయ గేమింగ్ ఇండస్ట్రీ 13,600 కోట్ల రూపాయలను ఆర్జించిందని కేపీఎంజీ సంస్థ అధ్యయనంలో లెక్కగట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 29,000 కోట్ల రూపాయలు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ అనేక వ్యతిరేక పరిణామాల నేపథ్యంలో.. కోర్టు వివాదాలు, ఆంక్షలు, నిషేధాల నడుమ ఆ స్థాయికి చేరుకుంటుందా అన్నది అనుమానమే. ఫ్రీ- టు ప్లేతో మొదలైన ఆట ప్లే-టు-ఎర్న్గా ఊపందుకుని ఇప్పుడు పే- టు-ప్లే ప్రీమియం మోడల్ దాకా వచ్చింది. గేమింగ్ కంపెనీలన్నీ ప్రీమియం మోడళ్ల పైనే దృష్టిపెట్టాయి. కొన్ని కంపెనీలు ఆట మధ్యలో వాణిజ్య ప్రకటనలకు అనుమతిస్తే.. ఫ్రీగా ఆడుకునే అవకాశం ఇస్తున్నాయి. ఇలాంటి ఫ్రీ యాప్లు బాగా అలవాటైన తర్వాత కొత్త ఫీచర్లతో ఆశపెట్టి డబ్బులు దండుకుంటున్నాయి. ఈమధ్య గేమింగ్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ పోటీలో వైవిధ్యమైన ఆటలే కాదు, ఆటగాళ్లకు ఇచ్చే బహుమతుల్లో కూడా వైవిధ్యం తీసుకొస్తున్నారు. హౌస్ ఆఫ్ గేమింగ్, ఫ్యాన్ క్లాష్, మెటా వన్ వెర్స్ కంపెనీలు ఆటగాళ్లకు క్రిప్టోకరెన్సీ, టోకెన్స్ను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా అందిస్తామని ప్రకటిస్తున్నాయి.
వద్దని వారించినా.. మొబైల్ గేమ్ ఎక్కువసేపు ఆడతామని గొడవ చేస్తే మాత్రం.. వాళ్లలో ఆందోళనకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని అనుమానించాలి. చదువులో వెనుకబడినా, ఇంట్లో సమస్యలు ఉన్నా, పరీక్షలు సరిగా రాయకపోయినా పిల్లలు ఆ వాస్తవం నుంచి బయటపడటానికి ఊహాజనిత ప్రపంచంలో అడుగుపెడతారు. మొబైల్ గేమ్స్ ఆడుతూ ఎక్కువ పాయింట్స్ సాధించి మురిసిపోతారు. ఆ సంతోషం కోసమే గేమింగ్ ప్రపంచంలో ఉండాలనుకుంటారు.
– సి. వీరేందర్, సైకాలజిస్ట్
ఆన్లైన్ గేమ్స్ వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయన్న కారణంతో చైనా గేమ్స్ కర్ఫ్యూ విధించింది. మైనర్లు ఆన్లైన్ ఆటల కోసం వెచ్చించే సమయంపై పరిమితి విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదని ఆదేశించింది. 16 ఏళ్లలోపు పిల్లలు నెలకు 200 యువాన్లు, 18 ఏళ్ల లోపు పిల్లలు నెలకు 400 యువాన్లు మాత్రమే ఖర్చు చేయాలి. మన దగ్గర కూడా అలాంటి పరిమితి ఉంటే బావుండేది. నిజానికి, ఇలాంటి షరతులు ఇంట్లోనూ విధించవచ్చు. పిల్లల కోసం తగినంత సమయం కేటాయించాలి. కబుర్లు చెప్పాలి. కథలు వినిపించాలి. జోకులు వేయాలి. అభిరుచులను ప్రోత్సహించాలి. వయసు పెరిగేకొద్దీ గేమింగ్ వ్యసనం తీవ్రరూపం దాల్చుతుంది. తొలిదశలోనే అడ్డుకట్ట వేయడం మంచిది.
యాప్ను చూస్తే ఆగలేరు. ఆడకుండా ఉండలేరు. ఆట మొదలైతే ఆగిపోరు. ఆపితే ఊరుకోరు. వర్చువల్ మైదానంలోకి అడుగుపెట్టారంటే.. మునుముందుకు పోవాల్సిందే! అదో పద్మవ్యూహం. ఆన్లైన్ ఆటలో ఉన్న గొప్పదనం ఏంటంటే?.. ఆట మొదలుపెట్టగానే అది మనసును తన అధీనంలోకి తీసుకుంటుంది. ఆడేటప్పుడు న్యూరాన్ ప్లెజర్ సెంటర్స్ బాగా పనిచేస్తాయి. వాటివల్ల వచ్చే సంతోషం (అనుభూతి) వేరే వాటివల్ల రాదు. కాబట్టి వేరే పనికి సిద్ధపడరు. కొత్తలో ఊరిస్తూ రివార్డులు వస్తుంటాయ్. గేమింగ్ డిజైన్లోనే ఈ ఏర్పాటు ఉంటుంది. కొత్తవాళ్లను గెలిపించి ‘ఫ్రీ’మియం వెర్షన్ నుంచి ప్రీమియం వెర్షన్ దాకా గుంజుకుపోతాయి. పైసలు పోతున్నా మోజు తీరదు. ఎన్నిసార్లు ఓడినా మనసు మారదు. పోయే డబ్బు పోతూ ఉంటుంది. అయినా స్కోరు పెంచాలనే పట్టుదల, ప్రైజ్ మనీ గెలవాలనే ఆశతో ఆన్లైన్ సంద్రంలో ఈదుతూనే ఉంటారు. ఆనందం కోసం ఆడుగుపెట్టి దానికి బానిసలై ఆనందాలే పోగొట్టుకున్న వాళ్లు ఎందరో. గంటలకొద్దీ ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల ప్రవర్తన కూడా మారిపోతుంది. ఆన్లైన్ గేమ్ వ్యసనం కూడా ఒక మానసిక వ్యాధేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నది. స్వీయ నియంత్రణ కోల్పోయి, ఏడాది కంటే ఎక్కువకాలం ఆన్లైన్ గేమ్ లేదా వీడియో గేమ్ ఆడుతూ.. రోజువారీ కార్యకలాపాలు, ఇతర ఆసక్తులు లేకుండా ఉంటే ఆ వ్యక్తి ‘గేమింగ్ డిజార్డర్’తో బాధపడుతున్నట్లుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది.
‘గేమింగ్ డిజార్డర్’ పరిధిలోకి రాకుండా ఉండాలంటే రోజువారీ ఆట 40 నిమిషాలు దాటకుండా ఉండాలి. ఇదో లక్ష్మణ రేఖ. నిజానికి, గేమింగ్ యాప్స్లో మేలు చేసేవీ ఉన్నాయ్. చెస్, సుడోకు, బిల్డింగ్ బ్లాక్స్, పదబంధాలు, చారిత్రక ప్రదేశాలతో ముడిపడిన యాప్స్ చాలా ఉన్నాయి. వీటిని 30 నుంచి 40 నిమిషాలసేపు ఆడొచ్చు. గంట, ఆపై సమయం ఆడితే మాత్రం.. వ్యసనంగా మారొచ్చు. ఆన్లైన్ చదరంగం లాంటివి.. మెదడుకు మరింత పదును పెడతాయి. చురుకుగా ఆలోచిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆన్లైన్ విజయాలతో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. కాలక్షేపం ఓ వ్యసనంగా మారకుండా జాగ్రత్తపడినంత కాలం.. ఏ వ్యాపకమూ హానికరం కాదు.
‘ఫాంటసీ గేమ్ ప్లాట్ఫారమ్’ అనేది వర్చువల్ రియాలిటీలో నిర్వహించే జూదశాల. గేమింగ్ కంపెనీలు యాప్ల సాయంతో డిజిటల్ పేమెంట్ గేట్వేల ద్వారా జూదాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒక్క క్లిక్తో నచ్చిన గేమ్ ఆడవచ్చు. ఆ తర్వాత గెలవవచ్చు. ఓడనూ వచ్చు. ఇప్పటికే ‘పబ్-జీ ఆడొద్దన్నందుకు తల్లిని చంపిన కొడుకు’ వార్త చదివే ఉన్నాం. ఎంతోమంది ఆన్లైన్ గేమ్ వ్యసనంతో చదువులో వెనుకబడటం, ఉద్యోగాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. ఆన్లైన్ గేమ్లను క్రమబద్ధీకరించకుంటే ఇవి నేరస్తులను తయారుచేస్తాయి. భారీ క్రీడా కుంభకోణాలకూ దారితీస్తాయి.
డబ్బులు పెట్టి పోటీపడే ఆన్లైన్ ఆటల్ని ‘రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)’ అంటారు. భారత్లోని ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో రియల్ మనీ గేమ్స్ 80 శాతం వరకూ ఉన్నాయి. ముందు చిన్నమొత్తాలతో మొదలవుతుంది. కొద్దికొద్దిగా పెరుగుతూ కొండంత అవుతుంది. అప్పు పుట్టదు. గతంలో చేసిన అప్పు తీరదు. చివరికి ఆస్తులు అమ్ముకోవడం, తాకట్టు పెట్టుకోవడం తప్పకపోవచ్చు. ఆ సమయంలో కొందరు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడి నేరస్తులుగానూ మారవచ్చు. కాబట్టి, ఆటను ఆటగానే తీసుకోవాలి. వ్యసనంగా మార్చుకుంటే ప్రమాదమే. వ్యక్తికే కాదు.. వ్యవస్థకు కూడా.
Thunder Mushroom | ఈ పుట్టగొడుగులు ఎందుకంత స్పెషల్.. ఇవి అన్నిచోట్ల ఎందుకు దొరకవు?