హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ (బెస్)లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలియజేసి, సర్కార్ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పబ్లిక్ సెక్టార్ డీ కార్బనైజేషన్ స్కీమ్ (పీఎస్డీఎస్)లో భాగంగా ట్రాన్స్కోకు చెందిన సబ్స్టేషన్లల్లోని ఖాళీ స్థలాల్లో ‘బిల్డ్-ఓన్ అండ్ ఆపరేట్’ పద్ధతిలో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. చౌటుప్పల్, మహేశ్వరంలో 750 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. 15 ఏండ్ల కాలపరిమితితో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ జెన్కో టెండర్లు పూర్తిచేసింది. దీంతో ఈ ప్లాంట్ల నుంచి 1,500 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు దక్షిణ, ఉత్తర డిస్కమ్లు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై ఈఆర్సీ త్వరలో బహిరంగ విచారణ జరుపనున్నది. ఈ విచారణ సందర్భంగా పలువురు విద్యుత్తు రంగ నిపుణులు ఈఆర్సీ ముందు తమ వాదనలు వినిపించనున్నారు.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్ట్పై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి సమగ్ర పరిశీలన జరుపాలి. అభ్యంతరాలు తెలిపేందుకు ఇచ్చిన సమయం సరిపోదు. వీజీఎఫ్ అర్హత కోసం రెండు గడువులు పూర్తయ్యాయి. అయినా ప్రక్రియను గడువులోగా పూర్తిచేయడంలో డిస్కమ్లు, సర్కార్ విఫలమయ్యాయి. వేర్వేరు పిటిషన్ల ద్వారా విడివిడిగా అనుమతులివ్వడం ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు.