– రాకపోకలు ప్రారంభించిన ఆరు నెలలకే గుల్లయిన వంతెన
– నాణ్యతా లోపంతో నరకయాతన పడుతున్న వాహనదారులు
జూలూరుపాడు, ఆగస్టు 07 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు – వినోబానగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ వంతెన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వంతెన నిర్మాణం పూర్తయి రాకపోకలు ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే భారీ గుంతలు తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వంతెన నిర్మాణ సమయం నుండి ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సర్వీస్ (డైవర్షన్) రోడ్డుపైనే వాహనాల రాకపోకలు సాగాయి. ఆ సమయంలో రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు, కాలక్రమేణా ఏర్పడిన భారీ గుంతల వల్ల నాలుగేళ్ల పాటు ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవించారు. తీరా వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని, రాకపోకలు ప్రారంభం కావడంతో ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు ఎంతో ఊరట చెందారు. కానీ ఆ సంతోషం ఆరు నెలలు కూడా నిలవలేదు.
వంతెన ప్రారంభించిన అతి కొద్ది నెలల్లోనే రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నాణ్యతా లోపం, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు వేగంగా వచ్చే ద్విచక్ర వాహనదారులు ఈ గుంతలను గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం వాహనాలు అదుపుతప్పి కిందపడటం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన వంతెన నెలల వ్యవధిలోనే దెబ్బతినడం పట్ల ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి తక్షణమే స్పందించాలని, వంతెనపై ఏర్పడిన గుంతలకు శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన మరమ్మతులు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.