చెన్నై: తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. కావేరి జల వివాదం నేపథ్యంలో.. తమిళనాడు ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. కావేరి అంశంలో రాజకీయం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. మేకదాతు డ్యామ్ అంశంలో రాష్ట్రం తమ హక్కులను ఎప్పటికీ వదులుకోదన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. కావేరి జల వివాదంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందన్నారు. కానీ మేకదాతు డ్యామ్ అంశంలో కర్నాటక సర్కారు మాత్రం దూసుకెళ్తున్నట్లు చెప్పారు.
టీవీకే సర్కారుపై వస్తున్న విమర్శలకు విజయ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడు జీవాధారం కావేది నది అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసే ఆలోచన తనకు లేదన్నారు. తమిళనాడు జలహక్కుల కోసం కావేరి అంశంలో కర్నాటక సర్కారుతో చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం విజయ్ అన్నారు. అసెంబ్లీ పాస్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోదీకి పంపామని, మేకదాతు అంశంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో తీర్మానాన్ని సపోర్టు చేశారన్నారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కూడా లేఖ రాసినట్లు విజయ్ తెలిపారు. కావేరి అంశంలో సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసినట్లు చెప్పారు. 1969 నుంచి కర్నాటక డ్యామ్ ప్రాజెక్టుల అంశంలో తమిళనాడు చర్చలు నిర్వహిస్తోందన్నారు. కావేరి జల వివాదాన్ని పరిష్కరించేందుకు కర్నాటక సీఎంతో మాట్లాడనున్నట్లు తెలిపారు. దీని కోసం బెంగుళూరు కూడా వెళ్లనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు శత్రు దేశాలు కూడా చర్చలు నిర్వహిస్తాయని, పక్క రాష్ట్రంతో మాట్లాడాలని నిర్ణయించానని, బెంగుళూరులో అవమానిస్తే ఏం చేస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయని, అయితే తమిళనాడు ప్రజల కోసం అవమానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ్ తెలిపారు.