చండూరు, ఆగస్టు 07 : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (MGNREGA) పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ–రామ్ జీ) పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్, షట్డౌన్ నిరసనలు అలాగే సమ్మె కార్యక్రమాలు ఈ నెల 15 వరకు నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా చండూరు మండలం పరిధిలోని ఉద్యోగులంతా పెన్ డౌన్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లు పే స్కేల్ అమలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బేసిక్ వేతన శ్రేణిని వెంటనే మంజూరు చేయాలన్నారు. సమాన వేతనం, గ్రామీణాభివృద్ధి విభాగంలోని ఇతర సంస్థల ఉద్యోగులతో సమానంగా తమకు కూడా వేతనాలు చెల్లించాలన్నారు. గత మూడు నెలలుగా నిలిచిపోయిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
గతంలో ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లోని ఉపాధి హామీ కార్యాలయాల్లో ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సరైన వేతనాలు లేక తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు.