1985వ సంవత్సరం. వరదరాజులు ఓ నేషనల్ బ్యాంక్లో సెక్షన్ ఆఫీసర్. మంచి జీతమే. కానీ ఆయనకు టూవీలర్ కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా రిక్షానే గతి. వాళ్లబ్బాయి టీవీ చూడటానికి పక్కింటికి వెళ్తాడు. వాళ్లావిడ ఏ ఆదివారమో సినిమాకు వెళ్తే బెంచి టికెట్టే ఎంచుకుంటుంది. ఇవన్నీ నేటితరానికి వింతగా అనిపించవచ్చు. కానీ 1990లకు ముందు పుట్టినవాళ్లకు సర్వ సాధారణం. ప్రతి ఒక్కరిలోనూ ఓ వరదరాజులు కనిపించేవారు. అప్పట్లో… టీవీ దగ్గర్నుంచి టీషర్ట్స్ వరకూ అన్నీ దొరికేవి. కానీ ఫైవ్ స్టార్ చాక్లెట్ను కూడా అబ్బురంగా చూసుకున్న తరం అది. ఇల్లు కట్టుకోవడాన్ని పెండ్లితో ముడిపెడుతూ సామెతలు వల్లించిన రోజులవి. కూల్డ్రింక్ దగ్గర్నుంచి కూలర్ వరకూ అన్నిటినీ విలాసాలుగా భావించిన పక్కా మిడిల్క్లాస్ జమానా! ఒకే ఒక్క తరంలో అనూహ్యమైన మార్పు వచ్చేసింది. అవసరాలు, సౌకర్యాలు, విలాసాల మధ్య రేఖలు చెరిగిపోయాయి. అప్పు తప్పు అనే వాదనను ఎవరూ ఒప్పుకోవడం లేదు. మిలీనియల్స్ జీవనశైలి మిలియనీర్లను తలపిస్తున్నది. ఎందుకింత మార్పు! దీనివల్ల కొన్ని నష్టాలున్నాయనే మాట సరే… అనూహ్యమైన లాభాలు కూడా ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.
15వ శతాబ్దం వరకూ వినిమయతత్వం అనే మాటే లేదు. వస్తు మార్పిడి ద్వారా ఇంటికి అవసరమైన వస్తువులను సొంతం చేసుకోవడమే తెలుసు. ఆ ఉత్పత్తులకు కూడా కుటీర పరిశ్రమలే కీలకం. 15-18 శతాబ్దాల మధ్య సముద్రయానం పెరిగింది. వలసవాదం కొత్త తీరాలను చేరుకుంది. దీన్నే ‘ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్’ అంటారు. ఈ సముద్ర వ్యాపారాలు, రాజ్య విస్తరణల కారణంగా కల్లోలాలు చెలరేగినా… కొత్త ఉత్పత్తులు, ఆహారాలు పరిచయం అయ్యాయి. ఇక 18వ శతాబ్దంలో మొదలైన పారిశ్రామిక విప్లవంతో ఉత్పత్తి తీరే మారిపోయింది. బ్రిటన్లో మొదలైన ఈ పరిణామం ఐరోపాలోని మిగతా దేశాలనూ, అమెరికానూ చుట్టుముట్టింది.. క్రమంగా పెట్టుబడిదారి విధానానికి దారితీసింది. ఉత్పత్తికి ఊతమిచ్చేట్టుగా యంత్రాలు, ఫ్యాక్టరీలు, గనులు పెరిగిపోయాయి. గ్లోబలైజేషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1970ల తర్వాత విమానయానాలు పెరిగాయి. ఔట్సోర్సింగ్ పేరుతో ఇతర దేశాల్లో వస్తువులను ఉత్పత్తి చేయించడం మొదలైంది. ఎగుమతులు విస్తృతమయ్యాయి. వీటికి కంప్యూటర్ విప్లవం తోడైంది. భారత్ సహా చాలా దేశాలు ఆర్థిక సంస్కరణల పేరిట అనుమతులు, పరిమితుల మీద ఆంక్షలు ఎత్తేశాయి. దాంతో ప్రజల ఆదాయం పెరిగింది. అంతకుమించి మార్కెట్లో ఉత్పత్తులూ పెరిగాయి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇంకొకటి.. ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు. పదివేల రూపాయల్లో టీవీ కొనుక్కోవచ్చు. లక్ష రూపాయల్లోనూ కొనుక్కోవచ్చు. లక్ష రూపాయలు పెట్టినా… అదే అంతిమం అనుకోవడానికి వీల్లేదు. అంతకుమించిన ధరలో ఇంకేదో లభిస్తుంది. కొన్నాళ్లకు మరిన్ని సౌకర్యాలతో మరింత మెరుగైన సరుకు మార్కెట్లోకి వస్తుంది. ఇదిగో.. ఇప్పుడే అసలు కథ మొదలైంది!
2016లో ఐఫోన్ వాడకందారులు ఓ చిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయిన వెంటనే, దాని పనితీరు మందగించేది. చార్జింగ్ త్వరగా అయిపోయేది. ఫోన్ పాతబడిందనో, బ్యాటరీ జీవితకాలం దగ్గరపడిందనో భావన కలిగేది జనానికి. చాలామంది పాత ఐఫోన్లను పక్కనపెట్టేసి, సరికొత్త మోడల్ ఐఫోన్లను తీసుకున్నారు. ఈ తీరు ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. యాపిల్ తన అమ్మకాలను పెంచుకునేందుకు ఇలా వ్యవహరించిందన్న ఆరోపణలూ వచ్చాయి. దీన్నే ‘బ్యాటరీగేట్ స్కాండల్’ అని పిలుస్తారు. ఈ వివాదంతో యాపిల్ భారీ నష్ట పరిహారాలను చెల్లించుకోవాల్సి వచ్చింది. తమ ఉత్పత్తిని కొంతకాలం తర్వాత పనికిరాకుండా చేసి… వినియోగదారులు సరికొత్త మోడల్ కొనుక్కునేలా ప్రేరేపించడాన్ని ‘ప్లాన్డ్ అబ్సెలెసెన్స్’ అని పిలుస్తారు. ఈమధ్యకాలంలో వస్తున్న ఫోన్లలో బ్యాటరీ మార్చుకునే అవకాశం లేకుండా చేయడం వెనుకా ఇలాంటి వ్యూహమే ఉందంటున్నారు.
వినియోగదారుల మనసును ఏమార్చి, ఎలాగోలా ఉత్పత్తులను కొనిపించే ఆలోచన చాలారోజుల నుంచీ ఉన్నదే. పారిశ్రామిక విప్లవం తర్వాత, అవసరానికి మించి సరుకులు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని అమ్మేందుకు ఈ తరహా వ్యూహాలు పన్నాల్సి వచ్చింది. ఉదాహరణకు 1920లలో ఫోర్డ్ కార్లతో పోటీని తట్టుకునేందుకు జనరల్ మోటార్స్… ఇంజిన్లో పెద్దగా మార్పు చేయకుండానే, పైపైన కారు రూపాన్ని మారుస్తూ సరికొత్త మోడల్స్తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. అమ్మకాల్లో ఫోర్డ్ను ఓడించింది! ఓసారి సూపర్
మార్కెట్ మధ్యలో నిలబడి చుట్టూ జరుగుతున్న తంతును చూస్తే వ్యాపార సంస్థలు ఈ కిటుకును ఎలా ప్రయోగిస్తాయన్నది అర్థం అవుతుంది. తమ రూపురేఖలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ‘సరికొత్త రుచిలో’, ‘మెరుగైన ఫార్ములా’, ‘ఆకర్షణీయమైన ప్యాక్లో’ అంటూ ఊదరగొట్టే నినాదాలన్నీ విక్రయ ఆయుధాలే! ఫోన్లలో ఈ ప్రభావాన్ని కచ్చితంగా గమనించవచ్చు. దీనికి ‘కంపారిజన్ నెగ్లెక్ట్’ అని పేరు పెట్టారు. ‘అప్గ్రేడెడ్’ అన్న మాట వినిపించగానే న్యూనతకు లోనైపోయి… కొత్త సిరీస్కు వెళ్లడమే ఈ ‘కంపారిజన్ నెగ్లెక్ట్’ తత్వం. ఈ విషయాన్ని నిరూపించేందుకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ ప్రయోగం కూడా చేశారు. కొంత మందిని ఎంచుకుని, వాళ్ల దగ్గర ఉన్న ఫోన్ బ్రాండ్లోనే.. ఇటీవల వచ్చిన మోడల్ను చూపించి, ఆ ఫీచర్లను వివరించారు. ఆశ్చర్యంగా, ఫీచర్ల మార్పుతో సంబంధం లేకుండా ‘అప్గ్రేడెడ్’ అన్న పదాన్ని చూడగానే, చాలామంది కొత్త మోడల్ తీసుకునేందుకు సిద్ధపడిపోయారు. కొందరిని మాత్రం, కాస్త నిదానించి ఆలోచించి చూడమని అడిగారు. ఆ కొద్దిమంది మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాబట్టి కళ్లను ఆకర్షించిన ప్రతిదీ గొప్పదేం కాదు. విచక్షణతో బేరీజు వేసుకోవడం ద్వారానే ఈ తరహా తప్పులను నివారించగలం!
పారిశ్రామిక విప్లవం, ప్రపంచీకరణ, సాంకేతికత అభివృద్ధి ఫలితాలుగా అవసరానికి మించిన వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. మనిషి వస్తువును ఎంచుకోవడం అనే పరిస్థితి మారిపోయి, వస్తువులే మనిషికి ఎరవేయడం మొదలుపెట్టాయి. దండోరాలతో మొదలై సామాజిక మాధ్యమాల వరకూ.. వ్యాపార సంస్థలు ప్రతి అవకాశాన్నీ ప్రచారం కోసం వినియోగించుకోసాగాయి. వినిమయతత్వంలో వేగం పెరిగింది. భౌతికమైన సంపద, వస్తువులు, సేవల కొనుగోళ్ల మీద ఓ వ్యక్తి సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయని నమ్ముతుందీ వినిమయతత్వం (కన్జ్యూమరిజం). వీటికోసం జరిగే ఖర్చు వల్లే ఆర్థిక వ్యవస్థ ముందుకు నడుస్తుందని దీని భావన. ఉదాహరణకు కార్ల వినియోగం పెరిగితే వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలు ఎదుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. కారు తయారీలో వాడే స్టీల్, రబ్బర్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, బ్యాటరీలు… ఇవన్నీ ఉత్పత్తి చేసే సంస్థలకూ పని దక్కుతుంది. చిన్నచిన్న అంకుర సంస్థలు సైతం బిలియన్ డాలర్ కంపెనీలుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. యాపిల్ నుంచి అమెజాన్ వరకు ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్న కంపెనీలన్నీ వినిమయతత్వం మీద నడుస్తున్నవే! ఇదీ ఒకస్థాయి వరకూ వినిమయతత్వం వల్ల కలిగే లాభం. కానీ వినియోగం హద్దులు దాటితే మాత్రం నష్టాలు మొదలవుతాయి.
1. వినిమయతత్వంలో వస్తువుల కొనుగోలు, సేకరణే కీలకంగా మారుతుంది. కాబట్టి అప్పటివరకూ ఉన్న నిరాడంబరత, పొదుపు-మదుపు స్వభావం.. పక్కకు తప్పుకొనే ప్రమాదం ఉంటుంది.
2. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను శ్రుతిమించిన వినిమయతత్వానికి సాక్ష్యంగా చెబుతారు. ప్రపంచ జనాభాలో అమెరికన్ల శాతం చాలా తక్కువే. కానీ కాగితం దగ్గర్నుంచి ఇంధనం వరకూ వారి అంతులేని అవసరాల వల్లే పుడమి మీద వనరులు వేగంగా కరిగిపోతున్నాయి. కాలుష్యమూ పెరిగిపోతున్నది. ప్రపంచంలోని జనమంతా అమెరికన్లలా యథేచ్చగా వనరులను వినియోగిస్తే… భూమిని పోలినవి మరో అయిదు గ్రహాలు కావాలట.
3. వినిమయతత్వం మన మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మనిషి సంఘజీవి. సాటి మనిషితో కలిసి ఎలా జీవిస్తాడో, అలాగే పోటీ పడతాడు కూడా. చదువు, కెరీర్కు ఉపయోగపడే పోటీతత్వం అభివృద్ధికి దోహదపడితే… కొనుగోళ్లలో పోలికలు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇవి కుంగుబాటుకు, బంధాల విచ్ఛిన్నానికి, న్యూనతకు
దారితీస్తున్నాయి.
..ఏతావాతా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏమిటంటే… మనం వస్తు ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాం. అవి మనకు సౌకర్యాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇస్తాయి. కానీ వాటి పరిమితులను గ్రహించకపోతే మాత్రం పద్మవ్యూహంలా మారి చుక్కలు చూపిస్తాయి. ఆ మంచిచెడుల విచక్షణ అంత తేలిక కాదు. చాలా సందర్భాల్లో మన చుట్టూ కనిపించే లెక్కలేనన్ని వస్తువుల మధ్య మనకు ఏం కావాలో నిర్ణయించుకునే శక్తి కూడా సన్నగిల్లుతుందని హెచ్చరిస్తుంటారు సైకాలజిస్టులు. దీనికి ‘డెసిషన్ ఫెటిగ్’ అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు సమస్య వస్తువును కొనడం కాదు! దాన్ని కొనాలో వద్దో నిర్ణయించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత మేర నిదానించాలి!
ఓ పదివేల రూపాయలు పెడితే బ్రహ్మాండమైన గడియారం వస్తుంది. మరి అందుకు వంద రెట్లతో వాచీలు ఎందుకు కొంటారు? చిన్న లెదర్ బ్యాగ్కు లక్షలు ఎందుకు పోయాలి? బట్టల నుంచి కార్ల వరకు… కొన్ని బ్రాండ్లు కళ్లు తిరిగే రేట్లలో ఎందుకుంటాయి? ధర పెరిగే కొద్దీ గిరాకీ కూడా పెరిగే ఈ తరహా వస్తువులను ‘వెబ్లన్ గూడ్స్’ అంటారు. వెబ్లన్ అనే ఆర్థికవేత్త దీన్ని రూపొందించారు. సంపద పెరుగుతున్న కొద్దీ కొనుగోలు స్వభావం మారుతుందనీ… అవసరం లేకపోయినా, అక్కరకు రాకపోయినా వస్తువులను కొనే అలవాటు పెరుగుతుందనీ చెబుతారు వెబ్లన్. దీనికే conspicuous consumption అని పేరు. పైగా తమ సంపదను పదిమందికీ చూపించాలనే తాపత్రయమూ మొదలవుతుంది. తన చుట్టూ ఉండేవారికంటే గొప్ప వస్తువులు, సేవలు ఖరీదు చేసి… వాటిని ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుంది. ఫలితంగా వెబ్లన్ గూడ్స్కు గిరాకీ పెరుగుతుంది.
కొవిడ్ కేవలం మన ఆరోగ్యం మీదేకాదు… ఆర్థికం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఉత్పత్తి రంగం కుదేలైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతే అదుపు తప్పుతుందనే భయాన్ని కలిగించింది. ఇలాంటి సందర్భంలో కూడా భారతీయులు చాలా నిబ్బరంగా ఉండటం… మారుతున్న ధోరణికి నిదర్శనం. 2021 చివర్లో డెలాయిట్ సంస్థ చేసిన ఓ సర్వేలో భారతీయులు ద్రవ్యోల్బణం గురించి కంగారుపడుతున్నా… 77% మంది భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు 85 శాతం మంది తాము రాబోయే నెలల్లో ఏదో ఒక ప్రయాణానికి వెళ్తున్నామని చెబితే, వచ్చే ఆరు నెలల్లో కొత్త వాహనాన్ని కొనుక్కునేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు.
వినియోగదారుల మనఃస్థితి ఆర్థిక రంగాన్ని శాసిస్తుంది. వారికి ప్రస్తుత పరిస్థితుల పట్ల సంతృప్తి, భవిష్యత్తు పట్ల ఆశ ఉంటే కనుక… బాగా ఖర్చు చేసేందుకు సిద్ధపడతారు. అందుకనే న్యూయార్క్కు చెందిన The Conference Board (CB) ప్రతి నెలా, వినియోగదారుల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. యాభై ఏండ్లకు పైగా సాగుతున్న ఈ సర్వేకు అక్కడ చాలా ప్రాధాన్యం ఉంది. ఇందులో భాగంగా ప్రతి నెలా, దేశవ్యాప్తంగా ఓ మూడువేల మంది అభిప్రాయాలను సేకరిస్తుంటారు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగం గురించి మీరు ఎంత సానుకూలంగా ఉన్నారు; మరో ఆరు నెలల్లో వ్యాపారాలు, మీ ఉద్యోగం, కుటుంబ ఆదాయం పట్ల ఎంత ఆశాజనకంగా ఉన్నారు.. అనే అయిదు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. 1985 నాటి వివరాల కంటే… ఇవి సానుకూలంగా ఉంటే పరిస్థితులు బాగున్నట్టు లెక్క!
అనగనగా ఓ వ్యాపారి… రూపాయికి రూపాయి వడ్డీ కలిపి, దానికి చక్రవడ్డీ వేసి లెక్కలేనన్ని వరహాలు కూడబెట్టాడు. ఖర్చు చేస్తే ఎక్కడ కరిగిపోతాయో అని భద్రంగా మూటగట్టాడు. అంతలోనే, ఆ డబ్బును దొంగలు దోచుకుంటారేమో అని భయం పట్టుకుంది. వెంటనే వాటిని కరిగించి బంగారు ఇటుకగా మార్చి, ఊరి చివర మర్రిచెట్టు కింద పాతిపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత అక్కడ తవ్విచూస్తే… బంగారం కనిపించలేదు. ఖాళీ గుంతను చూసి వ్యాపారి గుండెపగిలి ఏడుస్తుంటే… ఓ సన్యాసి అటుగా వచ్చాడు. ‘నువ్వు ఏడవడానికి కారణం కనిపించడం లేదు. నువ్వు ఆ బంగారు ఇటుకను చూసి మురిసిపోయావే కానీ, దానివల్ల వీసమెత్తు కూడా ఉపయోగం లేదు. ఓ పనిచెయ్యి! ఓ రాయిని ఇక్కడ పాతిపెట్టు. దాన్నే బంగారపు ఇటుక అనుకో. వాడుకోనప్పుడు బంగారం అయితేనేం, మట్టిగడ్డ అయితేనేం’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. పొదుపు హద్దులు మీరడం మంచిది కాదని ఈ కథ సారాంశం. దీన్ని ఈ తరానికి చెప్పాల్సిన పన్లేదు. వినిమయతత్వం పెరిగిపోవడంతో… మనసుకు నచ్చిన వస్తువు కొనుక్కోకుండా, జీవితాన్ని అనుభవించకుండా డబ్బు పోగేసుకుని ఉపయోగం ఏమిటనే భావన ఇప్పుడు రాజ్యమేలుతున్నది. ఎడతెరిపి లేని పనులు చక్కబెడుతూ, టార్గెట్ల పేరిట పరుగులు తీస్తున్నది సంపాదించడానికే కదా, ఆ సంపాదించింది ఖర్చుపెట్టకపోతే ఏం లాభం? అంటుంది నేటితరం.
నిజానికి వినిమయతత్వం పొదుపు-మదుపు వ్యవహారాలకు వ్యతిరేకం. వాటివల్ల మార్కెట్ డీలాపడిపోతుందని హెచ్చరిస్తుంటారు ఆర్థిక నిపుణులు. ‘పారడాక్స్ ఆఫ్ త్రిఫ్ట్’ అనే సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వ్యవస్థ మాంద్యం (రిసెషన్)లోకి జారిపోతున్నప్పుడు, అందరూ భవిత మీద భయంతో, పొదుపు ప్రయత్నం మొదలుపెడతారు. ఇలా చేయడం వ్యక్తిగతంగా లాభమేమో కానీ, వ్యవస్థకు నష్టం అంటుందీ సిద్ధాంతం. డబ్బు అనే ఇంధనం ఆగిపోవడంతో, వినిమయతత్వం మీద ఆధారపడిన ఆధునిక వ్యవస్థలు ఆగిపోతాయి. అందుకే మాంద్యం సమయంలో బ్యాంకులు… పొదుపు ఖాతాల మీద తక్కువ వడ్డీని ఇస్తూ, రుణాలను మరింత చవకగా మంజూరుచేస్తాయి. అందుకే, ఇరవై ఏండ్ల క్రితం ఏ జాతీయ సంస్థలైతే పొదుపును ప్రోత్సహించే ప్రయత్నం చేశాయో… ఇప్పుడు అవే సంస్థలు డబ్బును కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల మీద వడ్డీ విదిల్చేందుకే ఇష్టపడటం లేదు. తెలిసినా, తెలియకపోయినా… ఈ ఆర్థిక సంస్థల దృక్పథం మన మీద ప్రభావం చూపుతున్నది.
భారతీయులలో ఒకప్పుడు పొదుపు అలవాటు ఎక్కువగా ఉండేది. రిస్క్ తీసుకోవడానికి భయపడేవారు. సంప్రదాయ జీవనశైలికి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి… ఎప్పుడూ, ఎక్కడా ఇబ్బంది పడకూడదనే భావన ఇందుకు కారణం కావచ్చు. కానీ మనలో పొదుపు అలవాటు తగ్గిపోతున్నదని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఈమధ్యనే Scripbox అనే సంస్థ దేశవ్యాప్తంగా చేసిన ఒక సర్వేలో సగానికి సగం మంది తమ ఆదాయంలో 0-20 శాతం మాత్రమే పొదుపు చేస్తున్నట్టు తేలింది. ఇక 35 ఏండ్ల లోపువారు అయితే, పొదుపు ఖాతాల మీద అసలు ఆసక్తి చూపడం లేదట. HSBC బ్యాంక్ నిర్వహించిన మరో సర్వేలో కేవలం మూడో వంతు భారతీయులు మాత్రమే క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నట్టు వెల్లడైంది. సరైన బడ్జెట్ లేకపోవడం, ఆదాయానికి మించిన ఖర్చులకు అలవాటు పడిపోవడం, ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యం లేకపోవడం, మితిమీరిన అప్పులు ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆయుషి ఉపాధ్యాయ్ అనే ఆర్థిక నిపుణురాలు.
ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే రెండే మార్గాలు.. వెంటనే కొనుక్కోవడం లేదా కొనగలిగే స్తోమత వచ్చే రోజు కోసం ఎదురుచూడటం. ఇప్పుడు కాలం మారింది. ఫర్నిచర్ నుంచి ఫోన్ల వరకూ ఏ వస్తువునైనా అద్దెకు తీసుకునే అవకాశం లభిస్తున్నది. వేడుకలకు మంచి బట్టలు వేసుకోవాలంటే ఇప్పుడు ‘ఫ్లైరోబ్’ లాంటి సంస్థలు తళుకుబెళుకుల దుస్తులను అద్దెకిస్తున్నాయి. ఇక కార్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. నచ్చిన కారును కొన్నాళ్లపాటు లీజుకు తీసుకునే అలవాటు పెరిగిపోతున్నది. ఇప్పటికే 1,500 కోట్ల రూపాయల విలువను చేరుకున్న అద్దె కార్ల మార్కెట్, రాబోయే రోజుల్లో 20 శాతం ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక Pre Owned పేరిట సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనే అలవాటూ పెరిగిపోతోంది. ఈ తరహా వస్తువులకు డిజిటల్ మార్కెట్గా ఉన్న OLX గత ఏడాది 200 కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించడం ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇలా పలు రూపాల్లో కోరుకున్న వస్తువును పొందే అవకాశం… వినిమయతత్వానికి ఊతంగా నిలుస్తున్నది.
ఈమధ్య వచ్చిన ‘స్కిడ్ గేమ్’ సిరీస్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలతో చెలగాటమాడే ఆటలకు సిద్ధపడతారు. ఈ కథ ఎంత ఆసక్తిగా ఉంటుందో అంత భయాన్నీ, గగుర్పాటునీ కలిగిస్తుంది. నిజానికి ఈ కథ… సగటు దక్షిణ కొరియన్ల జీవన పోరాటమేనని అంటున్నారు విశ్లేషకులు. 1997లో వచ్చిన ఆర్థికమాంద్యం తర్వాత, అక్కడి యువత ఉద్యోగాలు కోల్పోయారు. స్వయం ఉపాధి మీద ఆధారపడటం నేర్చుకున్నారు. అంటే ఎక్కువమందివి భద్రతలేని జీవితాలన్నమాట! కానీ సొంత ఇంటి కోసం, ఆధునిక వసతుల కోసం వాళ్లు చేస్తున్న అప్పులు, తలకుమించిన భారం అయ్యాయి. ఏళ్లకు ఏళ్లు వడ్డీలు కడుతున్నారు. ఆదాయాలు మాత్రం పెరగలేదు. ఆ మాటకు వస్తే కొవిడ్ సమయంలో కాస్త తగ్గాయి కూడా! ఈ వ్యక్తిగత అప్పులు ఎంతగా పెరిగిపోయాయి అంటే… ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి కంటే కూడా, రుణభారమే 5 శాతం ఎక్కువగా ఉంది. అంటే జనం ఆఖరి రూపాయి వరకూ చెల్లించినా… ఇంకా అప్పు మిగిలిపోతుందన్నమాట. ఈ దెబ్బతో చిన్న వ్యాపారస్తులు దివాలా తీస్తున్నారు. చాలామంది ఆర్థికపరమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంత అప్పు చేసైనా సరే, ఆశ నెరవేర్చుకోవాలి అనే ఆధునిక పోకడకు దక్షిణ కొరియా రుణచరిత్ర ఓ నిదర్శనం.
అదృష్టవశాత్తు మన దేశంలో పరిస్థితి చాలా వరకు అదుపులోనే ఉంది. కానీ అప్పు చేసే అలవాటు మాత్రం నానాటికీ పెరుగుతోంది. Non Banking Financial Companies (NBFC) ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడమే ఇందుకు సాక్ష్యం. జనవరి 2021 నాటికి, ఈ తరహా సంస్థలు తొమ్మిదివేలకు పైగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నమోదై ఉన్నాయి. గృహరుణాల దగ్గర నుంచీ బంగారు నగల మీద తాకట్టు వరకూ వేర్వేరు మార్గాల్లో రుణాలు అందిస్తున్నాయి. జీరో డౌన్ పేమెంట్ లాంటి పథకాలతో ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ఆధునిక సాంకేతికత అందుకుంటున్నాయి(fintech). వీటికి మొబైల్లో కావల్సిన సమాచారాన్ని అందిస్తే చాలు… చిటికెలో రుణాలు మంజూరు చేస్తాయి. జాతీయ బ్యాంకులు కూడా ఈ రుణాల పోటీలోకి దిగుతున్నాయి. క్రెడిట్కార్డు రుణాలు, డిజిటల్ అకౌంట్లతో దూకుడు పెంచుతున్నాయి.
రుణాల గురించి వచ్చినప్పుడు Small-ticket personal loans (STPL) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా లక్ష రూపాయల లోపు రుణాలను STPL రుణాలుగా పరిగణిస్తారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాల కోసం ఈ తరహా రుణాలు విపరీతంగా పెరిగినట్టు తేలింది. ఇప్పుడు ఫోన్ కొనాలన్నా కూడా ఈఎమ్ఐ సౌకర్యం లభిస్తుంది. అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లోకి ప్రవేశిస్తే… ఓ మూడు వేల రూపాయల వస్తువును కూడా వాయిదాల పద్ధతి మీద తీసుకునే అవకాశం ఉంటున్నది. అందుకే, గత నాలుగేళ్లలోనే పదివేల రూపాయల లోపు రుణాల సంఖ్య ఏకంగా 20 రెట్లు పెరిగినట్టు తేలింది. ఇలా చిన్నపాటి రుణాలు తీసుకునేవారిలో 54 శాతం మంది 35 ఏండ్ల లోపువారే కావడం గమనార్హం. కొవిడ్ భయం కాస్త తగ్గిన వెంటనే, ఈఎమ్ఐ ద్వారా కొనుగోళ్లు చేయడంలో ఏకంగా 220 శాతం పెరుగుదల కనిపించింది.
ఈ విషయాలన్నీ ఓ పరిణామాన్ని సూచిస్తున్నాయి. ‘అప్పు చేసి పప్పు కూడు’ అనే ఎగతాళి సామెత నుంచి ‘అప్పు తప్పు కాదు’ అనే ధోరణికి ఇప్పటి తరం చేరుకుంటున్నది. పిల్లల ఫీజుల నుంచి స్మార్ట్ టీవీల వరకూ ఇప్పుడన్నీ ఖర్చుతో కూడుకున్న అవసరాలే. వాయిదాలు లేకుండానో, రుణం తీసుకోకుండానో… ఏకమొత్తంలో చెల్లించి కొనడం మధ్యతరగతికి అసాధ్యం. ఆశ్చర్యం ఏమిటంటే… స్థూల జాతీయ ఉత్పత్తిలో మనం తీసుకున్న అప్పుల శాతం ఇంకా 37.3 మాత్రమే! అమెరికా (79.5%), చైనా (61.7%), సింగపూర్ (55.4%) లాంటి ఎన్నో దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. సురక్షితం కూడా!
ఇదీ సంగతి! ఇప్పటి కొనుగోళ్ల తీరునూ, ఖర్చులనూ చూసి ‘మా రోజుల్లో అయితే…’ అని పోల్చుకోవడం అనవసరం. ఎందుకంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి మనిషీ తాను వినియోగదారుడిననే బాధ్యతతో బతుకుతున్నాడు. దాన్ని సక్రమంగా నిర్వహించగలిగితే… జీవితం సాఫీగా సాగిపోతుంది. రుణం సైతం లాభంగా పరిణమిస్తుంది. వస్తువులు సుఖాన్ని అందిస్తాయి. ఆపాటి విచక్షణ బ్రహ్మవిద్యేమీ కాదు!
అమ్మో ఏం తెలివిరా బాబూ.. ఈ దొంగల చోరీ స్టైల్ తెలిస్తే షాకవ్వాల్సిందే !!
ఇవి గెలిచినోళ్ల సక్సెస్ స్టోరీస్ కాదు.. ఒక్క తప్పుతో బొక్కబోర్లా పడ్డ వ్యాపారుల కథలు!!
ఆఫ్రికాలో సెటిలై వివిధ రంగాల వారికి ఇన్స్పిరేషన్గా మారిన మన తెలంగాణ బిడ్డలు వీళ్లే