Failure Businessmen Stories |అతనో చిన్న వ్యాపారి. ఇంటింటికీ తిరిగి సరుకులు అమ్ముకునేవాడు. కొన్నాళ్లకు నాలుగు వీధుల మధ్య చిన్న దుకాణం పెట్టుకున్నాడు. నిదానంగా కాస్త పెట్టుబడి సేకరించి, సరుకుల్ని స్వయంగా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్నది.. లాభం నిలుస్తున్నది కానీ.. ఏదో అసంతృప్తి. ఇంకా ఎదగాలనే కసి! ఏ వస్తువుకు ఎంత గిరాకీ ఉంది, వినియోగదారులకు ఎలాంటి సేవలు నచ్చుతాయి.. తదితర విషయాలన్నీ ఇప్పుడు తనకు కొట్టినపిండి. ఆ అనుభవంతోనే దూకుడు పెంచాలని నిశ్చయించుకున్నాడు. ప్రణాళికలు ఎక్కుపెట్టి, ఉన్న ఆస్తిని పెట్టుబడిగా మార్చి.. పెద్ద అడుగు వేశాడు. లెక్క తప్పలేదు. అద్భుతమైన విజయం సాధించాడు. చాలామంది వ్యాపారవేత్తల జీవితకథలు ఇలాగే ఉంటాయి. కానీ ‘ఆ తర్వాత రాజుగారు, సుభిక్షంగా తన రాజ్యాన్ని పరిపాలించారు’ అన్నంత సులువుగా మాత్రం ముగిసిపోవు. వ్యాపారం నడిసంద్రపు నావలాంటిది. అతను అజాగ్రత్తగా ఉన్నా, పరిస్థితులు కలిసిరాకున్నా మునక తప్పదు. నిరంతర అప్రమత్తత ఉండాల్సిందే. మహా మహా సంస్థలు సైతం ఎలా కుప్పకూలాయో తెలుసుకునే ప్రయత్నం ఇది. ఈ పాఠాలు కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడతాయి.
స్వాతంత్య్రం వచ్చాక, భారతీయ వ్యాపార రంగం కుదురుకోవడానికి చాలా సమయమే పట్టింది. 1968 నాటికి కానీ విదేశీ పెట్టుబడులను నియంత్రించే సాధికారిక వ్యవస్థ ఏర్పాటుకాలేదు. ఆ మరుసటి ఏడాది బ్యాంకుల జాతీయం తర్వాత రుణాలు అందుబాటులోకి వచ్చాయి. 1977లో మొట్టమొదటిసారి రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లడంతో, ప్రైవేటు రంగంలో పరిశ్రమలు విస్తరించేందుకు ఓ కొత్త మార్గం దొరికినట్టయింది. కానీ పరపతి, అవినీతితో పాటు ‘జీ హుజూర్’ అంటేనే అనుమతులు మంజూరు అయ్యే ‘లైసెన్స్ రాజ్’లో మార్పు వచ్చేందుకు చాలా సమయమే పట్టింది. ప్రపంచీకరణ, ఆన్లైన్ సేవలు, మేనేజ్మెంట్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాక వ్యాపార అవకాశాల గురించి నలుగురికీ తెలుస్తున్నది. నిబంధనలు పారదర్శకం అవుతున్నాయి. సరైన బాటలో నడిస్తే, ఎవరైనా సరే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులు వచ్చాయి. కానీ అదే సమయంలో స్వయంకృతాపరాధాలు పెరిగిపోయాయి. ఇదిగో ఇలా..
‘నంద్లాల్ మాధవ్లాల్ ధూత్’ పేరు చాలాకొద్ది మందికే తెలిసి ఉంటుంది. 1950లలో ఆయన పత్తి, చక్కెర పరిశ్రమల్లో మంచి లాభాలే గడించారు. ఆ ఊపు మీదే, తన ముగ్గురు కుమారులతో కలిసి వీడియోకాన్ సంస్థను స్థాపించారు. టీవీలకు గిరాకీ పెరుగుతున్న సమయంలో ఆ సంస్థ టీవీల ఉత్పత్తిలో మంచి మార్కెట్నే అందుకుంది. మన దేశంలో తొలి కలర్ టీవీలను ఉత్పత్తి చేసింది వీడియోకానే అని చెబుతారు. క్రమంగా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు… తదితర గృహోపకరణాల తయారీలో తన సత్తా చాటింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం తైవాన్, జపాన్, అమెరికా… వంటి దేశాల వైపు చూడాల్సిన రోజుల్లో వీడియోకాన్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ రోజు మనం వీడియోకాన్ విజయగాథను చెప్పుకొనేవాళ్లం. కానీ ప్రస్తుతం వీడియోకాన్ అప్పులపాలై, వేదాంత గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓ చిన్న పొరపాటుతో ఈ దుస్థితి మొదలైందని చెబుతారు విశ్లేషకులు. టీవీలన్నీ ఎల్సీడీ, ఎల్యీడీల దిశగా మారుతున్న సమయంలో… పిక్చర్ ట్యూబ్లు తయారుచేసే సంస్థను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది వీడియోకాన్. మారిన సాంకేతికతకు అనుగుణంగా తన ఫ్యాక్టరీలను తీర్చిదిద్దేందుకు వేల కోట్లు ఖర్చు చేసింది. ఆ కాస్త సందులో ఎల్జీ, శామ్సంగ్ లాంటి కొరియా సంస్థలు మార్కెట్ను చేజిక్కించుకున్నాయి. మరోవైపు తనకు ఏమాత్రం అనుభవం లేని ఇంధన రంగంలోకి అడుగుపెట్టి… విదేశీ తీరాల్లో భారీ పెట్టుబడి పెట్టింది వీడియోకాన్. దీనికోసం సేకరించిన రుణాలు తడిసి మోపెడయ్యాయి. అప్పటికే విపరీతమైన పోటీ నెలకొని ఉన్న టెలికామ్ రంగంలో అడుగుపెట్టి ఏకంగా ఏడువేల కోట్ల రూపాయలు నష్టపోయింది. గుడ్డిలో మెల్లగా డీటుహెచ్ సేవలు కాస్త నిలదొక్కుకున్నా, అవి ఏ మూలకీ చాల్లేదు. పైగా ఆర్థికనేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాధవ్లాల్ ధూత్ వారసుడు వీడియోకాన్ యజమాని వేణుగోపాల్ ధూత్ మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సీయీవోగా చరిత్ర సృష్టించిన చందా కొచ్చర్కు కూడా ఈ మరక అంటుకోవడంతో, ఆమె పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
తారాజువ్వకు కూడా సూర్యుడిని చేరుకోవాలని ఉంటుంది. కానీ అందుకు తగిన శక్తిని పోగేసుకోకపోతే, అందరి ముందూ కుప్పకూలుతుంది. అనిల్ అంబానీ విషయంలోనూ అదే జరిగింది. తండ్రి ధీరూభాయ్ బతికున్న రోజుల నుంచే అనిల్కు అసాధారణ చరిష్మా ఉండేది. చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన వ్యాపార మెలకువలకు తోడు, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే చొరవ తన సొంతం. తండ్రి మరణం తర్వాత, అన్న ముకేశ్ నుంచి విడిపోయాడు అనిల్. తన వాటాగా వచ్చిన టెలికామ్, విద్యుత్ సంస్థల మీద మంచి లాభాలు సంపాదించే అవకాశమే ఉంది. నిజానికి 2008లో రిలయన్స్ పవర్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు కేవలం పదిసెకన్లలోనే షేర్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అదో చరిత్ర! ఆ ఏడాది తను ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానంలో నిలిచాడు. పద్నాలుగేండ్లు తిరిగేసరికి.. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదంటూ లండన్ న్యాయస్థానం ముందు చేతులెత్తేయాల్సిన పరిస్థితి. దాదాపు రూ. 400 కోట్లు పెట్టి భార్యకు ఏకంగా ఓ నౌకను బహుమతిగా ఇచ్చినవాడు… ఆమె మీదే ఆధారపడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగినట్టు? ముందూవెనుకా ఆలోచించకుండా, అన్నిటిలోనూ తలదూర్చే ప్రయత్నమే అనిల్ కొంప ముంచిందని చెబుతారు.
విద్యుత్ రంగంలో స్థిరత్వం లేదని గ్రహించకుండానే అందులో భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. వినోద రంగంలో లాభాలు అంతంత మాత్రమేనని తెలిసి కూడా అంతర్జాతీయ సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. టెలికామ్లో వస్తున్న మార్పులనూ అందుకునేందుకు యత్నించలేదు. దాంతో పోటీ తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. చివరికి ఆయుధ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసి అవినీతి మరక అంటించుకున్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం, ఉన్నవాటిని విస్తరించడం కోసం అనిల్ చేసిన అప్పులు చేయిదాటిపోయాయి. బ్యాంకులు కోర్టుకు ఈడ్చాయి. సహజంగానే వీటి ప్రభావం తన షేర్ల మీద పడింది. 800 రూపాయలున్న షేరు ఒక్క రూపాయికి చేరుకున్న రోజులూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ షేర్ మార్కెట్ అయితే రిలయన్స్కు ప్రాణం పోసిందో, అదే తనపాలిట భస్మాసుర హస్తంగా నిలిచింది. ఇక్కడ మరోమాట కూడా చెప్పుకోవాలి. జీవితాన్ని కాచి వడపోసిన ‘ధీరు’భాయి.. తదనంతరం పంపకాలు ఎలా జరగాలి, గొడవలు వస్తే ఏం చేయాలి అనే విషయం మీద మాత్రం దృష్టి పెట్టలేదనే వాదనా ఉంది.
సహారా అంటే ఆసరా అని అర్థం. అది ఓ ఎడారి పేరు కూడా! ఎవరి జీవితానుభవాన్ని బట్టి వాళ్లు అర్థం చేసుకోవాల్సిందే. సహారా సంస్థ పట్ల కూడా ఇలాగే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 1976 నాటికి సహారా చిట్ఫండ్ కంపెనీ అనే చిన్నపాటి వ్యాపార సంస్థ ‘ఈరోజు మూతపడదామా, రేపు మూతపడదామా’ అనే డోలాయమానంలో ఉంది. అందులో ఉద్యోగిగా చేరిన సుబ్రతో రాయ్కి మాత్రం.. ఆ సవాలు తనని తాను నిరూపించుకునే అవకాశంగా తోచింది. వెంటనే దాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. పరుగులు తీయించాడు. పదుల కొద్దీ కంపెనీలుగా విస్తరించాడు. టీవీ చానల్స్, వార్తాపత్రికలు, సినిమా నిర్మాణం, హోటల్స్, బీమా రంగం, ఆసుపత్రులు, విమానాలు… ఇంతై ఇంతై వామనుడిలా విశ్వరూపం చూపాడు. ఇక రియల్ ఎస్టేట్ సరేసరి! న్యూయార్క్లో ప్రతిష్ఠాత్మక ప్లాజా హోటల్ కొనుగోలు చేసి, భారతీయుల సత్తా చాటాడు. ఒక దశలో 12 లక్షల మంది ఉద్యోగులతో, భారతీయ రైల్వే తర్వాత అతిపెద్ద యజమానిగా చరిత్ర సృష్టించాడు. దేశంలోనే ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలోకి చేరాడు. కానీ తన వ్యాపార విస్తరణ కోసం పేదల డబ్బే పెట్టుబడిగా పెడుతున్నాడని ఆరోపణలు మొదలయ్యాయి. ఇది చట్ట విరుద్ధమంటూ సెబీ లాంటి సంస్థలు కొరడా ఝళిపించాయి. జనం నుంచి తీసుకున్న సొమ్మును వాపసు చేయమంటూ ఆదేశాలు జారీ చేశాయి. చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో సుబ్రతో తీహార్ జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నా, సహారాకు పూర్వ వైభవం అసాధ్యం కావచ్చు.
ఓ బ్లాక్బస్టర్ సినిమాను తలపించే జీవితం విజయ్ మాల్యాది. తండ్రి లిక్కర్ దిగ్గజం. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో 28 ఏండ్లకే బిజినెస్ ఎంపైర్ పగ్గాలు చేపట్టాడు. తన మనసుకు నచ్చిన మనిషిని పెండ్లి చేసుకున్నాడు. తను విలాసపురుషుడే! కండ్లు చెదిరే పార్టీలకు పెట్టింది పేరు. మోడల్స్తో అర్ధనగ్నంగా క్యాలెండర్లను రూపొందించి, తనో ప్లేబాయ్ అన్న సంగతి ప్రపంచానికి చాటుకోవడానికి సిగ్గుపడలేదు. అలాగని వ్యాపారాలను అశ్రద్ధ చేయలేదు. తన హయాంలో కింగ్ఫిషర్ బీర్ 50 శాతం మార్కెట్ను సొంతం చేసుకుంది. దాదాపు 50 దేశాలకు ఎగుమతి జరిగేది. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మద్యం తయారీ సంస్థగా అవతరించింది. ఆ ఊపులో మాల్యా పట్టిందల్లా బంగారంగా మారింది. తన కింద ఏకంగా 60 కంపెనీలు ఉండేవి. కిసాన్ జామ్, సింగర్ కుట్టుమెషీన్లు, క్యాడ్బరీస్ చాక్లెట్లు… ఇలా ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్లెన్నో తన అధీనంలో ఉండేవి. వీటితో పాటుగా బెర్జర్ పెయింట్స్, క్రాంప్టన్ లాంటి సంస్థలనూ సొంతం చేసుకున్నాడు. 1990లలో తన వ్యాపారం వేల కోట్లలో జరిగేది. ఆ సమయంలో రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు మాల్యా. ఒక దశలో కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే సూచనలూ కనిపించాయి. టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వేలంలో కొనుగోలు చేసి, దేశభక్తుడిగా నిరూపించుకునే ప్రయత్నమూ చేశాడు. 2005లో మాల్యా విమానయానంలోకి కూడా ప్రవేశించాడు. అక్కడా లాభాలే సాధించాడు. కానీ మాల్యా బుర్రలో ఏం తొలిచిందో కానీ తన ప్రత్యర్థి ఎయిర్ డెక్కన్ సంస్థను కొనుగోలు చేశాడు. పేదలకు విమానయానాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో మొదలైందే ఎయిర్ డెక్కన్. మరోవైపు ధరలకు వెనుకాడకుండా, విలాసవంతమైన సేవలు అందించే సంస్థ కింగ్ఫిషర్. దాంతో రెండిటినీ కలిపి ఒక బ్రాండ్గా మార్చడం సాధ్యం కాలేదు. పైగా విస్తరణ కాంక్షతో, లాభాలు రావని తెలిసిన ప్రాంతాలకూ విమాన సేవలు మొదలుపెట్టారు. పోటీ ఎక్కువగా ఉండే అంతర్జాతీయ మార్గంలోకి ప్రవేశించాడు. క్రమంగా నష్టాలు, వాటితో పాటు రుణాలు మొదలయ్యాయి. అదే సమయంలో మాల్యా తన విలాసవంతమైన జీవితాన్ని వదలకపోవడం చూసి జనాలకు కడుపు మండింది. ఓవైపు కింగ్ఫిషర్ మునిగిపోతుంటే మరోవైపు మాల్యా తన పుట్టినరోజున కిలోల కొద్దీ బంగారాన్ని గుళ్లకూ గోపురాలకూ దానం చేశాడు. వందలాది మంది సెలెబ్రిటీలతో గోవాలో వేడుకలు చేసుకున్నాడు. తన తీరు పట్ల పెరుగుతున్న జనాగ్రహాన్ని చూసి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ తర్వాత కథ ఇక తెలిసిందే! కథ కంచికి… మాల్యా లండన్కు!
సర్దార్ సరోవర్- దేశంలోనే అతిపెద్ద ఆనకట్ట, తెహ్రీ- ఆసియాలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, నాథ్పా- దేశంలోనే అతి పెద్ద భూగర్భ విద్యుత్ ఉత్పాదక కేంద్రం. ఇలాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టిన సంస్థ పేరు జేపీ. దాన్ని స్థాపించిన వ్యక్తి జైప్రకాష్ గౌర్. ఓ సివిల్ ఇంజినీర్గా కెరీర్ ప్రారంభించి.. జైప్రకాష్ సొంతంగా నిర్మాణ రంగంలో కాలుమోపాడు. క్రమంగా ఎన్నో కంపెనీలుగా జేపీ గ్రూప్ను విస్తరించాడు. ఆ సమయంలోనే, నిర్మాణ రంగంలో అనూహ్యమైన ఎదుగుదల కనిపించింది. దాంతో వేల కోట్లను భూముల మీదా, కట్టడాల మీదా పెట్టుబడి పెట్టింది జేపీ గ్రూప్. నోయిడా రహదారి పక్కన నిర్మిస్తున్న అపార్టుమెంట్లు పర్యావరణానికి చేటు అంటూ ప్రభుత్వం ఎర్రజెండా చూపించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపుల వల్ల ప్రతిష్ఠాత్మక యమునా ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ నెమ్మదించింది. ఇలాంటి భారీ నిర్మాణాలు అసాధారణమైన పెట్టుబడితో సాగుతాయి. ఏమాత్రం ఆలస్యం జరిగినా… కోట్ల కొద్దీ నష్టం తప్పదు. అదే జరిగింది. వాటికి తోడు తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రాజెక్టుల్లో వేలు పెట్టింది జేపీ. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి, రేస్ కోర్స్ ట్రాక్ నిర్మించింది. అది ఎందుకూ కొరగాకుండా పోయింది. జేపీ సంస్థ పెట్టుబడులు అన్నీ మౌలిక రంగాలైన సిమెంట్, రియల్ ఎస్టేట్, విద్యుత్, హోటల్ లాంటి వ్యాపారాల్లోనే ఉండేవి. ఒకదాని మీద ఒకటి ఆధారపడిన ఈ వ్యాపారాల్లో కుదుపు రావడంతో ఒక్కసారిగా సంస్థ కుప్పకూలిపోయింది. జైప్రకాష్ వయసు మీరిపోవడంతో… వారసుల మధ్య పోరు మొదలైంది. రుణ ఎగవేతదారులంటూ ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ముద్రవేయడంతో.. జేపీ గ్రూప్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.
గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆటకైనా వ్యాపారానికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ చేజేతులా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదు. చాలా సందర్భాల్లో వ్యాపార సామ్రాజ్యాలు
కుప్పకూలడానికి అనేక కారణాలు కనిపిస్తాయి…
తనకు మాలిన ధర్మం ఎంత ప్రమాదకరమో, తనది కాని వ్యాపారమూ అంతే చేటు. కాలం కలిసొస్తున్నది కదా అని బొత్తిగా తెలియని జగత్తులోకి అడుగుపెడితే చీకట్లు కమ్ముకోవడం ఖాయం.
వ్యాపారం లాభాలు సాధిస్తున్నది కదా అని మురిసిపోవడానికి లేదు. ముందుముందు ఎలా ఉండాలి, ఎటు సాగాలి, లక్ష్యాలు ఏమిటి? అనే కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. యజమాని దగ్గర నుంచి ఉద్యోగి వరకూ దీని మీద ఓ స్పష్టత అవసరం.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియడం హీరోకే కాదు మంచి వ్యాపారవేత్తకూ అవసరమే. అహంకారం, పట్టుదల, మొహమాటంతో ఏదైనా తొందరపాటు అడుగు వేస్తే వెంటనే వెనక్కి తగ్గాలి.
రోజులు ఒకప్పటిలా లేవు. సాంకేతికత నిరంతరం ఎదుగుతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. నిన్న ప్రభంజనం సృష్టించిన వస్తువు ఈ రోజు
మూలనపడిపోవచ్చు. మనం చేసే ఉత్పత్తి అందుకు తగినట్లు మారాల్సిందే!
ఒక కొత్త మార్గం తెరుచుకోగానే… పొలోమంటూ పరుగు తీయడం విచక్షణ లక్షణం కాదు. టెలికాం రంగంలో అడుగుపెట్టిన వారందరూ దాదాపుగా చేతులు కాల్చుకోవడానికి ముఖ్య కారణం ఇదే.
వినియోగదారులు దేవుడితో సమానమని అంటారు. నిజమే! నచ్చితే లాభాల వరం ఇస్తారు. నొచ్చుకుంటే నష్టాలను శపిస్తారు. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ల అభిరుచులు తెలుసుకుంటూ, గౌరవిస్తూ, అందుబాటులో ఉండాలి.
వ్యాపారం అన్నాక అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతాయి. సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అనే ‘క్రైసిస్ మేనేజ్మెంట్’ సూత్రాలు తెలిసి ఉండాలి. కనీసం అలాంటి నైపుణ్యం ఉన్నవారి సలహాలైనా తీసుకోవాలి.
ఒకస్థాయి వరకూ రుణాలు వ్యాపారానికి ప్రాణం పోస్తాయి. అందుకు తగిన రాబడి లేకపోయినా, పరిమితి లోపల ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినా… అవే ఉసురు తీస్తాయి. రుణాలు, చేతిలో నగదు నిల్వలు, వ్యయం, పెట్టుబడి… ఇలాంటి ఆర్థిక విషయాల మీద పూర్తిస్థాయి అవగాహన, నియంత్రణ అవసరం.
శశి రూయా అనే వ్యక్తి చెన్నై 1969లో పోర్టుకు సంబంధించి ఓ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఆ ఉత్సాహంలో అతను మొదలుపెట్టిన ఎస్సార్ గ్రూప్ 2015 నాటికి 1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని అందుకునే దశకు చేరుకుంది. ముడి చమురు, స్టీల్, విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. కానీ ప్రతి సందర్భంలోనూ అంచనాలు తప్పింది. చమురు పరిశ్రమ వృద్ధి చెందుతున్న సమయం దాటేశాక అందులో అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్ రంగం విలవిల్లాడుతున్న దశలో… విస్తరణ చేపట్టింది. విద్యుత్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నప్పుడు భారీ ప్రాజెక్టులు ప్రారంభించినా… అవి ఉత్పత్తి మొదలుపెట్టే సమయానికి గిరాకీ పడిపోయింది. ఇక మిగతా అన్ని కంపెనీల్లాగానే టెలికామ్ రంగంలో భారీ నష్టాలు చవిచూసింది. ఒకప్పుడు నౌకాశ్రయాల నుంచి గనుల వరకూ ప్రతిచోటా తన ప్రాబల్యం చాటుకున్న ఎస్సార్… ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోయింది.
టాటా, ఫియట్, ఫోర్డ్, ఆస్టిన్ మార్టిన్, బీఎమ్డబ్ల్యూ… ఇలాంటి పేరున్న కార్ల కంపెనీలన్నీ ఇంజిన్ పరికరాల కోసం ఒకే కంపెనీ మీద ఆధారపడటం ఎంత అద్భుతం! అరవింద్ ధామ్ నెలకొల్పిన యామ్టెక్ అనే సంస్థకు ఆ అవకాశం వచ్చింది. దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని అనూహ్యమైన లాభాలు సంపాదించాడు. విదేశాలకు సైతం వేల కోట్ల రూపాయలను ఎగుమతి చేసేది యామ్టెక్. కానీ విస్తరణ కాంక్ష అరవింద్ను నిలువనీయలేదు. కాఫీ షాపులు, ఔషధ రంగం, ఐటీ… అంటూ అన్నిటిలోనూ కాలుమోపాడు. అక్కడ వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకునేందుకు… యామ్టెక్ తంటాలు పడింది. ఇక మీదట ఆటో రంగం తప్ప మిగతా వ్యాపారాల జోలికి పోనంటూ అరవింద్ నాలుక కరుచుకున్నా ఉపయోగం లేకపోయింది. దివాలా తప్పలేదు.
ఒక వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి. దాన్ని విస్తరిస్తే ఇంకొన్ని లాభాలు వస్తాయి. కానీ ఈ సూత్రానికి చాలా పరిమితులు ఉంటాయి. వనరులను సరిచూసుకుంటూ, మార్కెట్ను గమనించుకుంటూ, భవిష్యత్తును ఊహించుకుంటూ అడుగు ముందుకేయాలి. అలా కాకపోతే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా సరే పేకమేడలా కుప్పకూలాల్సిందే! అందుకు సంజయ్ సింఘాల్, నీరజ్ సింఘాల్ వైఫల్యాలే ఉదాహరణ. తండ్రి నుంచి చేతికి అందిన స్టీల్ వ్యాపారాన్ని అన్నదమ్ములిద్దరూ పంచుకున్నారు. BPSL, BSL పేర్లతో వేల కోట్ల వ్యాపారానికి అధిపతులయ్యారు. కానీ ఒకరినిమించి ఒకరు ఎదగాలనే పోటీతో అవసరానికి మించిన విస్తరణ చేపట్టారు. ఆ క్రమంలో నీరజ్ ఆర్థిక నేరాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. సంజయ్ దివాలా తీశాడు.
ఎదుగుదల అంటే శిఖరాన్ని చేరుకోవడంతో సమానం. ముందుకు పడే ప్రతి అడుగూ… మనల్ని మరో మెట్టు ఎక్కించవచ్చు. కానీ తప్పులకు తావెక్కువ ఉంటుంది. అగాథంలోకి జారిపోయే ఆస్కారం ఉండనే ఉంటుంది. పరిస్థితుల్లో అనుకూలత తగ్గిపోతుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడికి సిద్ధం కావాల్సి ఉంటుంది. నిరంతరం ఆ ఎరుక సాధ్యమైతేనే అప్రమత్తంగా ఉండగలరు. అహంకారమో, అతి విశ్వాసమో తోడైతే మాత్రం పాతాళానికి జారిపోవడమే కాకుండా… తన మీదే ఆధారపడిన వేలాది కుటుంబాలకు నష్టం కలిగించిన వారవుతారు. ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీస్తారు. ఓ భారీ సంస్థ కుప్పకూలితే, ప్రపంచమే తల్లడిల్లిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఎదుగుదలను ఓ బాధ్యతగా తీసుకోవాలి!
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!