Telangana People in Africa | నల్లజాతికి బానిస సంకెళ్లు వేసిన తెల్ల దురహంకారానికి గుణపాఠం చెప్పిన ఖండం. చెరసాలలు ఏ పోరునూ ఆపలేవని నిరూపించిన నేల. ‘నలుపు-తెలుపు’ వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పిన నల్లసూరీడు నెల్సన్ మండేలాకు జన్మనిచ్చిన గడ్డ. ఇప్పుడు.. ఆ అవని అవకాశాల గని. ఏ దేశవాసి అడుగుపెట్టినా.. అమ్మలా అక్కున చేర్చుకుంటున్నది. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నుంచి రెక్కలు కట్టుకొని వెళ్లినవారిని కూడా ఆదరిస్తున్నది. ఆ ఖండంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు నేడు ఉన్నత హోదాల్లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే మనవారు ఎక్కువగా స్థిరపడ్డారు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా, నైజీరియా, కెన్యా, ఘనా, జాంబియా, టాంజానియా, ఉగాండా, సోమాలియా, స్వాజిల్యాండ్, నమీబియా, సౌత్ సుడాన్ వంటి దేశాలకూ విస్తరించారు. ‘రెయిన్బో నేషన్’గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికాలో మనవారిదే హవా. ఒక్క జోహన్నెస్బర్గ్లోనే దాదాపు ఆరు వేల మంది తెలుగువారు ఉన్నారు. అందులో 40 శాతం తెలంగాణ బిడ్డలే. అతి తక్కువ సమయంలోనే దక్షిణాఫ్రికాతో పాటు.. ఆఫ్రికా ఖండం మొత్తం విస్తరించింది తెలంగాణ సంతతి. తెలంగాణ నుంచి ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టిన వారంతా మొదట్లో ఏదో ఒక ఉద్యోగం కోసం వెళ్లినవారే. అక్కడితో ఆగకుండా.. కొలువులు చేస్తూనే అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేశారు. చిన్నచిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి ఆంత్రప్రెన్యూర్షిప్ను చాటుకున్నారు. సాఫ్ట్వేర్, గనులు, వ్యవసాయం, ఎగుమతులు – దిగుమతుల రంగాల్లో ఆరితేరారు. ఆఫ్రికా ఖండంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న కొందరు తెలంగాణ బిడ్డల పరిచయం..
పూర్తిపేరు: ఉమామహేశ్వర్ కుంట
స్వస్థలం: నిర్మల్
దక్షిణాఫ్రికాకు వెళ్లింది: 2007లో
రంగం : గనులు (ఎస్ఎస్ మైనింగ్ అండ్ ఎస్ఎస్ ట్రేడింగ్)
ఉపాధికోసం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఉమామహేశ్వర్ మైనింగ్ కంపెనీలో మేనేజర్గా కెరీర్ ప్రారంభించి.. సొంతంగా ఓ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆయన ఉద్యోగ జీవితం మాపోచ్స్ మైన్ అనే సంస్థలో మొదలైంది. ఆ సమయంలోనే మైనింగ్ లోతుపాతులు తెలుసుకున్నారు. ఆ తర్వాత మాంగనీస్, ఆంత్రసైట్ బొగ్గు వంటి ఖనిజాల అన్వేషణలో పడ్డారు. తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో.. ‘ఎస్ఎస్ మైనింగ్’, ‘ఎస్ఎస్ ట్రేడింగ్’ కంపెనీలను ప్రారంభించారు. అయితే, అక్కడ కొంత వర్ణ వివక్ష ఎదురైంది. స్థానికుల సహకారం కరువైంది. వాటన్నిటినీ అధిగమించి పూర్తిగా వ్యాపారంపైనే దృష్టిపెట్టారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆంత్రసైట్ వెలికితీత ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాంగనీస్ ఖనిజానికి అపారమైన మార్కెట్ ఉందని గ్రహించి… జింబాబ్వే, జాంబియా, స్వాజిల్యాండ్ వంటి దేశాల్లో అన్వేషణ ప్రారంభించారు. కొద్దికాలంలోనే ఆ ప్రయత్నం ఫలించింది. నాణ్యమైన మాంగనీస్ దొరికింది. ప్రస్తుతం వివిధ ఖనిజాలను భారత్, గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్నారు ఉమామహేశ్వర్. తన కంపెనీ ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికాలోనే ఉంటున్నారు.
పూర్తిపేరు : మేడసాని రాజా నరేంద్రరెడ్డి
స్వస్థలం : హైదరాబాద్
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2003లో
రంగం : ఎగుమతులు – దిగుమతులు, పూజా సామగ్రి, ఐటీ, రెస్టారెంట్స్
ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాకు వెళ్లినా.. అక్కడి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించారు నరేంద్ర రెడ్డి. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఎగుమతులు – దిగుమతుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అది వృద్ధిలోకి రావడంతో జోహన్నెస్బర్గ్లో ఐటీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. తెలుగువారికి, దక్షిణాఫ్రికా పౌరులకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించారు. ఆ తర్వాత భారతీయ రెస్టారెంట్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ‘స్వరుచి’, ‘తబలా’, ‘అభిరుచి’ తదితర పేర్లతో భారతీయ రెస్టారెంట్లను ప్రారంభించారు. అక్కడి తెలుగువారే కాదు, భారతీయ రుచులను ఇష్టపడేవారంతా నరేంద్రరెడ్డి రెస్టారెంట్లకు వరుసలు కడుతుంటారు. ‘స్వదేశీ’ పేరుతో అతిపెద్ద పూజా సామగ్రి స్టోర్ను కూడా నిర్వహిస్తున్నారు. దేవుళ్ల ప్రతిమలు, చిత్రపటాలు, వ్రతాలు, హోమాలకు సంబంధించిన పూజా సామగ్రి అక్కడ అందుబాటులో ఉంటుంది. ఔషధాలు, వనమూలికల దుకాణాన్నీ నడుపుతున్నారు.
పూర్తిపేరు : ఎల్ఎన్ శర్మ బొడ్డుపల్లి
స్వస్థలం : ఖమ్మం
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2010 అక్టోబర్లో
రంగం : గనులు
పన్నెండేండ్ల క్రితం సరిగ్గా గాంధీ జయంతి రోజున దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారు ఎల్ఎన్ శర్మ. ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ పర్మిట్పై రెండేండ్ల కాలానికి అక్కడికి వెళ్లారు. ఎనిమిదేండ్ల పాటు బహుళజాతి గనుల సంస్థలలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి, అంతర్జాతీయ మైనింగ్ కంపెనీలకు సాంకేతిక సలహాలు, సేవలు అందించేందుకు ఆరిక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. కమోడిటీ ట్రేడింగ్ నిర్వహిస్తారు. మైనింగ్ పరికరాలు కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, మొజాంబిక్, నైజీరియాలకు తన సేవలు అందిస్తున్నారు. దీనితో పాటుగా క్రోమ్ అనే ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. స్థానిక మార్కెట్ను బట్టి ఆంత్రసైట్ బొగ్గు సరఫరా చేస్తున్నారు.
పూర్తిపేరు : మాలిని బండి
స్వస్థలం : వరంగల్
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2009లో
రంగం : సాఫ్ట్వేర్ (సెస్టాసాఫ్ట్ సొల్యూషన్స్)
సరదాగా ఒకసారి దక్షిణాఫ్రికాను చుట్టేద్దామని వెళ్లిన మాలిని ఆ దేశాన్ని తన స్వస్థలంగా మార్చుకున్నారు. యూరప్, అమెరికా, ఆసియా అంతటా తన వ్యాపారాన్ని విస్తరించారు. వరంగల్కు చెందిన మాలిని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ చేశారు. దాదాపు 15 ఏండ్లుగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నారు. ఆమె కెరీర్లో ఎక్కువభాగం పాట్నీ కంప్యూటర్స్లోనే గడిచింది. దక్షిణాఫ్రికాలో ఎమ్టీఎన్, పేకార్ప్, మల్టీచాయిస్ సంస్థలలో సీనియర్ హోదాలో పనిచేశారు. ఈ క్రమంలో ఓ ఐటీ కంపెనీని ప్రారంభించాలనే ఉద్దేశంతో ‘సెస్టాసాఫ్ట్ సొల్యూషన్స్’కు ప్రాణం పోశారు. దక్షిణాఫ్రికా యువత ప్రతిభను వెలికి తీయడం, భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు ఉద్యోగం కోసం వచ్చేవారికి ఉపాధి కల్పించడం తన ప్రధాన లక్ష్యమని చెబుతారు. సెస్టాసాఫ్ట్ సొల్యూషన్స్కు దక్షిణాఫ్రికా, దుబాయ్, భారత్ లాంటి దేశాల్లో క్లయింట్స్ చాలామందే ఉన్నారు. ఈ కంపెనీ ఐటీ సేవలు, క్వాలిటీ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నది. యువతకు ఉపాధి మార్గాన్ని చూపించేందుకు ‘సెస్టా అకాడమీ’ని స్థాపించారు మాలిని. ఇది గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్న వారికి ఓ వేదిక. దక్షిణాఫ్రికాలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తుంది. సెస్టా సేవలు హైదరాబాద్కూ విస్తరించాయి.
పూర్తిపేరు : వెల్తపు భూమయ్య
స్వస్థలం : వరంగల్, దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2006లో
రంగం : వ్యవసాయం, సూపర్ మార్కెట్లు
వరంగల్కు చెందిన ఐటీ నిపుణుడు వెల్తపు భూమయ్య కిట్స్లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆయనది రైతు కుటుంబం. వ్యవసాయమంటే మక్కువ. కలల్ని నిజం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా బాటపట్టారు. ఉద్యోగం కొనసాగిస్తూనే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ మిత్రుడితో కలిసి కూరగాయల సాగు కోసం 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. కానీ, ఆ వ్యవసాయ క్షేత్రం తాను ఉంటున్న ప్రాంతం నుంచి 450 కి.మీ. దూరంలో ఉండేది. దీంతో నిర్వహణ కష్టమైంది. తీవ్ర నష్టాలపాలయ్యారు. అయినా నిరాశపడలేదు. ఈసారి, వంద కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. దిగుబడి వచ్చేనాటికి వడగండ్ల వానలు పంటను నాశనం చేశాయి. రెండుసార్లు నష్టపోయినా.. పొలం పనిలో ఆనందం వెతుక్కుంటూ జోహెన్నస్బర్గ్లోని తన ఇంటికి దగ్గరగా మరో 50 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. పలు రకాల కూరగాయలు పండిస్తూ, రిటైల్ అవుట్లెట్ల ద్వారా స్థానిక భారతీయులకు విక్రయిస్తున్నారు. పండ్లతోటలు పెంచి, డ్రైఫ్రూట్స్ వ్యాపారంలోకి రావాలన్నది ఆయన ఆలోచన.
పూర్తిపేరు : మురళి బండారు, స్వస్థలం : హైదరాబాద్, దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2010 మార్చిలో, రంగం : ఐటీ
హైదరాబాద్కు చెందిన మురళి బండారు అరోరా కాలేజ్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మూడేండ్లు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. ఉపాధి అవకాశాల కోసం 2010లో దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. అక్కడ విద్య, బీమా, బ్యాంకింగ్, రవాణా, ఆర్థిక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపు 12 ఏండ్లుగా బ్రెయిన్లైన్లో సీనియర్ డెవలపర్గా, బిడ్విస్ట్, ఈ4 సొల్యూషన్స్ కంపెనీల్లో టెక్నికల్ మేనేజర్గా, టీమ్ లీడర్గా కొనసాగారు. ఈ4 సొల్యూషన్స్ సంస్థ నుంచి ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ట్రావెల్ఐటీలో సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రవాస భారతీయులను ఒక్క దగ్గరికి చేర్చి.. తెలంగాణ సాంస్కృతిక, సంబురాలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ‘ఛారిటీ డ్రైవ్’లు నిర్వహించి స్వచ్ఛంద సేవలకు ఆ నిధులు ఉపయోగిస్తున్నారు.
పూర్తిపేరు : నాగరాజు గుర్రాల
స్వస్థలం : జగిత్యాల
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2008 ఆగస్టులో
రంగం : ఐటీ సేవలు, మైనింగ్ లాజిస్టిక్స్/ట్రాన్స్పోర్ట్, ఛారిటీ
నాగరాజు గుర్రాల ప్రాథమిక విద్య కరీంనగర్లో, ఇంటర్ నల్లగొండలో, ఇంజినీరింగ్ ఎంవీఎస్ఆర్ (హైదరాబాద్)లో సాగింది. ఆ తర్వాత హైదరాబాద్లోని స్పేషియల్ టెక్నాలజీ సంస్థలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడే సాఫ్ట్వేర్ డెవలపర్గా చేరారు. ఐబీఎం-ఎమ్ఎన్టీ క్లెయింట్లో దాదాపు పదేండ్లు పనిచేశారు. టీమ్ హెడ్గా పదోన్నతి పొందారు. తర్వాత ‘షేర్సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్’ను ప్రారంభించారు. ‘తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ దక్షిణాఫ్రికా’ సంఘంలో సభ్యుడిగా, మీడియా కమిటీ మెంబర్గా, సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. 2018 నుంచి దక్షిణాఫ్రికా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పేదలు, అనాథలు, దివ్యాంగ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటనలో మీడియా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ బతుకమ్మ పండుగను ఆఫ్రికా ఖండంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే మైనింగ్ (లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్) వ్యాపారంలోకి అడుగుపెట్టారు. జాంబియా, జింబాబ్వే దేశాల్లో ‘జేఎన్ఎస్’ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటుచేశారు. ఆయన సతీమణి ప్రియాంక ‘అప్లిఫ్ట్ ఏ చైల్డ్’ అనే ఎన్జీఓకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
పూర్తిపేరు : రఘు కలకొండ, స్వస్థలం : షాద్నగర్, దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2002లో, రంగం : సాఫ్ట్వేర్, విద్య
రఘు హైదరాబాద్లోని సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. అక్కడ కొన్ని ఐటీ ప్రాజెక్టులు చేపట్టారు. అయినా, అనుకున్నంతమేర ఎదుగుదల లేకపోవడంతో వెనక్కి రావాలని అనుకున్నారు. కానీ వీసా పరిమితులు అడ్డు తగిలాయి. ఆ అవరోధాలు ఆయనలోని ఆంత్రప్రెన్యూర్షిప్పై నీళ్లు చల్లాయి. అయినా, పట్టువదలకుండా ప్రయత్నించి దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారు. అక్కడ ఐటీ సలహాదారుగా ఉద్యోగం సంపాదించి, విద్యారంగంలోకి ప్రవేశించారు. వివిధ పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘డ్రీమ్ హిల్స్’ అనే విద్యాసంస్థను నెలకొల్పారు. ఆ తర్వాత ఆహార వ్యాపారంలోకి అడుగుపెట్టి.. ఇండియన్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఓ ఐటీ స్టార్టప్లో పెట్టుబడి పెట్టారు.
పూర్తిపేరు : శ్రీనివాస్ గుండా,
స్వస్థలం : సెంటినరీ కాలనీ, పెద్దపల్లి జిల్లా
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2003లో
రంగం : సాఫ్ట్వేర్/ఎక్స్పోర్ట్స్-ఇంపోర్ట్స్
పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీనివాస్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా కెరీర్ ప్రారంభించారు. మన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే ఆలోచన మొదటి నుంచీ ఉంది. ఈ క్రమంలో ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ‘భారత్ స్పైస్’ సంస్థను నెలకొల్పారు. అమెరికా నుంచి 2003లో దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటుచేస్తూ.. దక్షిణాఫ్రికాలో ఉంటున్న భారతీయుల కోసం పప్పు దినుసులు, మసాలాలను భారత్ నుంచి దిగుమతి చేయించేవారు. భార్య లలిత సహకారంతో ‘భారత్ స్పైస్’ సంస్థ ద్వారా సౌదీ, చైనా, దుబాయ్, దక్షిణాఫ్రికా వంటి వివిధ దేశాలకు కిరాణా, భారతీయ కూరగాయలు, రోజువారీ ఆహార ఉత్పత్తులతో సహా అనేక వస్తువులను సరఫరా చేస్తున్నారు.‘భారత్ స్పైస్’ పేరుతో సూపర్ మార్కెట్ను నిర్వహిస్తున్నారు.
పూర్తిపేరు : దామోదర్ మోసంగి
స్వస్థలం : మహబూబ్నగర్ టౌన్
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2003లో
రంగం : ఫార్మా కాస్మొటిక్స్
మహబూబ్నగర్ పట్టణానికి చెందిన దామోదర్ మోసంగి.. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద ఫార్మా – కాస్మొటిక్స్ కంపెనీ ‘ఎమ్కా’లో సైంటిస్ట్గా చేస్తున్నారు. ఆయనది మధ్య తరగతి కుటుంబం. మహబూబ్నగర్లోనే ఎమ్మెస్సీ చేశారు. తర్వాత ‘దయిచీ’ అనే జర్మన్- జపనీస్ కంపెనీలో పని చేశారు. దక్షిణాఫ్రికాలో అవకాశాల గురించి తెలుసుకొని.. ఆ గడ్డమీద వాలారు దామోదర్. అక్కడ ‘ఎమ్కా’ అనే అతిపెద్ద ఫార్మా అండ్ కాస్మొటిక్స్ కంపెనీలో సైంటిస్ట్గా ఉద్యోగం సంపాదించారు. ఆ కంపెనీ మార్కెట్లో విడుదల చేయాలనుకునే ప్రతి ఉత్పత్తిపై పరిశోధన చేస్తారు దామోదర్. అయన నేతృత్వంలోని నిపుణుల బృందం పచ్చజెండా ఊపిన తర్వాతే, ఏ వస్తువు అయినా మార్కెట్లో విడుదల అవుతుంది. అక్కడితో దామోదర్ బాధ్యత తీరిపోదు. వివిధ దేశాల్లో, వివిధ వాతావరణాలకు తగినట్టు ఆ ఉత్పత్తి ఎలా పనిచేస్తుందన్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ క్రమంలో తరచూ టర్కీ, అమెరికా, పారిస్, జర్మనీ, ఇటలీ, భారత్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రయాణిస్తుంటారు. అక్కడి మార్కెట్ తీరుతెన్నులు, అంతిమ ఫలితాలను అధ్యయనం చేస్తుంటారు. దామోదర్ జోహాన్నెస్బర్గ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా సభ్యులుగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భార్య శిల్ప దక్షిణాఫ్రికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. తమ కవలపిల్లల చదువు కోసం ఉద్యోగం వదిలేశారు శిల్ప. ఇప్పుడు తనే సొంతంగా దక్షిణాఫ్రికా, భారత్లలో ఒక ఫార్మా కంపెనీని ప్రారంభించాలని అనుకుంటున్నారు. అన్నీ సరిగ్గా కుదిరితే ఏడాదిన్నరలోనే ఓ ఫార్మా అండ్ కాస్మొటిక్స్ కంపెనీకి యజమానిగా మారతారు దామోదర్ మోసంగి.
పూర్తిపేరు : శ్రీనివాస్ వాసిరెడ్డి
స్వస్థలం : ఏటూరు నాగారం, ములుగు జిల్లా
దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2003లో
రంగం : ఐటీ
స్థానికంగా తెలుగువారికి ఏ సమస్య వచ్చినా మొదటగా గుర్తుకువచ్చే వ్యక్తి శ్రీనివాస్ వాసిరెడ్డి. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోనే.. అమెరికాకు చెందిన ‘ఆర్ఫైన్ సిస్టమ్’ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. కొన్నాళ్లకు భారత్లో ఆ కంపెనీ కార్యకలాపాలు ముగియడంతో మలేషియాకు బదిలీ చేశారు. దీంతో అంతదూరం వెళ్లలేక మిన్నకుండిపోయారు శ్రీనివాస్. 2003లో జరిగిన క్రికెట్ వరల్డ్కప్ పోటీలు చూస్తూ.. దక్షిణాఫ్రికాపై మనసుపారేసుకున్నారు. అక్కడి స్నేహితులను సంప్రదించి వెంటనే దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ప్రోగ్రామర్గా, డెవలపర్గా, టీమ్లీడర్గా, మేనేజర్గా పలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. ఈక్రమంలో 2012లో సొంతంగా ‘ఐసాఫ్ట్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించారు. దాని ద్వారా 40 మంది తెలుగువాళ్లకు, 160 మంది దక్షిణాఫ్రికా పౌరులకు ఉద్యోగాలు కల్పించారు. అది లాభాల్లోకి రావడంతో 2014లో ‘ఫస్ట్ టెక్నాలజీ’ అనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఐసాఫ్ట్ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత్కు చెందిన హెచ్సీఎల్ సీనియర్ ప్రాక్టీస్ మేనేజర్గా పని చేస్తున్నారు. దక్షిణాఫ్రికా వస్తున్న తెలుగువాళ్లకు మెంటర్గా ఉంటూ, అవసరమైన రిఫరెన్స్లు ఇస్తూ.. 150 మందికిపైగా ఉద్యోగాలు ఇప్పించారు. శ్రీనివాస్ సేవలను గుర్తించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం అక్కడి పౌరసత్వం ఇస్తామన్నా.. తెలంగాణతో బంధాన్ని వదులుకోవడం ఇష్టంలేక తిరస్కరించారు. ఒకానొక దశలో అక్కడ ‘ఫారిన్ ఎంపీ’ పదవిని సైతం తిరస్కరించారు శ్రీనివాస్.
పూర్తిపేరు : హరీశ్ రంగా, స్వస్థలం : రామన్నపేట, యాదాద్రి జిల్లా.. దక్షిణాఫ్రికాకు వెళ్లింది : 2007లో, రంగం : సాఫ్ట్వేర్/ ఛారిటీ
పద్నాలుగేండ్ల క్రితం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన హరీశ్ రంగా అక్కడి ప్రభుత్వ రంగసంస్థలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఆ దేశంలో తెలుగు ప్రజలు చేపట్టే ఏ సేవా కార్యక్రమంలో అయినా హరీశ్ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. కరోనా మొదటి, రెండో దశల్లో భారత్కు చెందిన బాధితులను గుర్తించి సాయం చేయడంలో కీలకంగా పనిచేశారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ, తెలుగు శాఖలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. అయితే దక్షిణాఫ్రికాలో అపార అవకాశాలు ఉన్నాయని, తపనతో కృషి చేస్తే.. అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చని అంటున్నారు. దక్షిణాఫ్రికా చాలా అందమైన దేశం. అంతకుమించి అపార అవకాశాలున్న దేశం. వలసలు ఎక్కువైపోతే.. స్థానికులకు అవకాశాలు దక్కవంటూ కొందరు స్వార్థపరులు అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. కానీ, అక్కడివారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం చూపించలేకపోయారు. దీంతో యువత పెడదారి పట్టింది. నేరాలు పెరిగాయి. గుండె పొరల్లో మంచితనం, ఆప్యాయత మాత్రం అలాగే ఉన్నాయి. అదే అక్కడున్న మనవారికి శ్రీరామరక్ష. ఇప్పుడు ప్రస్తావించిన వారు కొందరే అయినా.. వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఎంతోమంది తెలంగాణ బిడ్డలు అక్కడున్నారు. మనవారితో సహా.. స్థానికులకు కూడా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. వారందరి పక్షానా.. జై తెలంగాణ!
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
“ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”