Mandadi Nagarjuna reddy | ఆయనో తహశీల్దార్. పొద్దున్నే.. కోచింగ్ సెంటర్లో బోధిస్తారు. సాయంత్రం.. ‘నక్షత్ర సక్సెస్ అకాడమీ’లో ఆన్లైన్ క్లాసులు చెబుతారు. రాత్రి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పుస్తకాలు రాస్తారు. కోచింగ్, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుతో ‘మౌనిక ఫౌండేషన్’ ద్వారా పేదలకు సాయం చేస్తారు. సామాజిక మార్పే లక్ష్యంగా వైవిధ్యమైన మంత్లీ చాలెంజ్ నిర్వహిస్తున్న ఆ తహశీల్దారు పేరు.. మందడి నాగార్జున రెడ్డి.
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం బోయగూడెం నాగార్జున స్వగ్రామం. ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్ తర్వాత టీటీసీ చేశారు.డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సంపాదించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలురాసి.. 2010లో సహాయ గిరిజన సంక్షేమ అధికారిగా, 2012లో డిప్యూటీ తహశీల్దార్గా ఎంపికయ్యారు. తర్వాత తహశీల్దార్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నల్గొండ మండల తహశీల్దార్గా పనిచేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూనే.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నియామక విధానం పట్ల అవగాహన కల్పిస్తారు. రాత పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం పుస్తకాలు రాశారు. భారతదేశ చరిత్రను పోటీ పరీక్షల కోణంలో తిరగరాశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర-సంస్కృతిపై సుబోధకమైన రచనలు చేశారు. ఆన్లైన్లోనూ విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ‘నక్షత్ర సక్సెస్ అకాడమీ’ని ప్రారంభించారు. తన యూట్యూబ్ చానెల్ ద్వారా గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర నియామక పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తాను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచే స్టడీ మెటీరియల్ అందించాలనే ఆలోచన ఉండేది. ఆ కల ఇప్పుడు నిజమైంది. నైపుణ్యం ఉన్నా సరైన అవగాహన లేక, ఖరీదైన కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకాలన్నీ రాశారు.
మౌనిక ఫౌండేషన్
నాగార్జున కోడలు యాంజియో సర్కమ్ క్యాన్సర్ వల్ల రెండేండ్ల క్రితం చనిపోయింది. ఆ సంఘటన ఆయనను కదిలించింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఎవ్వరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో ‘మౌనిక ఫౌండేషన్’ స్థాపించారు. పుస్తకాల విక్రయాలు, నక్షత్ర సక్సెస్ అకాడమీ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బును ఫౌండేషన్కే ఇచ్చేస్తారు. ఉదయం 10.30 నుంచి తహశీల్దారుగా ఆయన విధి నిర్వహణ ఆరంభం అవుతుంది. ఆ సమయానికంతా శిక్షణ తరగతులు పూర్తవుతాయి. ప్రతి బ్యాచ్కు రూ.50వేల నుంచి లక్ష వరకూ పారితోషికం వస్తుంది. ‘తెలంగాణ ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని వార్షిక కాంట్రాక్టు కింద మరొకరికి ఇచ్చేశారు. ప్రచురణకర్తల నుంచి రూ.10 లక్షలు వచ్చాయి. దానికితోడు స్నేహితులు మరో రూ.10 లక్షలు సమకూర్చారు. పుస్తకాలు, యూట్యూబ్, కోచింగ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్కు కేటాయించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బోధన, పుస్తకాలు తనకు అత్యంత ఇష్టమైన వ్యాపకాలనీ, సేవ తన బాధ్యత అనీ అంటారు నాగార్జున రెడ్డి.
సామాన్యుడే ముఖ్యం
ఫౌండేషన్ మూలధనంగా ఉన్న రూ.20 లక్షల ద్వారా నెలనెలా కొంత డబ్బు వస్తుంది. మంత్లీ చాలెంజ్లో భాగంగా ఆ మొత్తంతో నెలకో కుటుంబానికి ఖర్చు చేస్తారు. ఇంకేదైనా తీవ్ర సమస్య తమ దృష్టికి వచ్చినా, తలా కొంత వేసుకొని సాయం చేస్తారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ‘నాకు ఖద్దరు వేసుకున్నవాళ్లు కాదు, సామాన్యుడు ముఖ్యం. అందుకే నా దగ్గరికి వచ్చే వాళ్ల కుటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటా. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారైతే నా తరగతులకు హాజరు కావచ్చని చెబుతాను. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లయితే మా ఫౌండేషన్ను సంప్రదించమని సూచిస్తా. సేవ చేయడానికీ అదృష్టం ఉండాలి’ అంటున్నారు తహశీల్దార్ మందడి నాగార్జున రెడ్డి.
నెలనెలా సవాలు..
మౌనిక ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల విద్య, వైద్య అవసరాలు తీర్చే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నైపుణ్యం ఉన్నా పేదరికం వల్ల ఎలాంటి ఉపాధీ లభించక ఇబ్బంది పడుతున్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీనికోసం ప్రతీనెల ‘మంత్లీ చాలెంజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాగార్జున అండ్ ఫ్రెండ్స్. ప్రతీనెల ఒక కుటుంబాన్ని ఎంపికచేసి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తున్నారు. మంత్లీ చాలెంజ్ కాన్సెప్ట్ నచ్చి ప్రభుత్వ ఉద్యోగులు, స్నేహితులు తలా ఓ చేయి వేసేందుకు కలిసి వస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అన్నది వారి నినాదం. ఇటీవల ఒక చిరుద్యోగి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు. విషయం తెలుసుకొని నాగార్జున రెడ్డి మిత్రబృందం ఆ కుటుంబానికి రూ.5 లక్షల సహాయం చేశారు. ఇలాంటి వితరణలు అనేకం.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా