హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు యశోద దవాఖానకు చేరున్నాడు. వైద్యులతో మాట్లాడి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరామర్శించేందుకు బయలుదేరారు. కాగా, రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్కు తీసుకెళ్లారు.
కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. ఉదయం 8గంటల నుంచి సుమారు గంట పాటు ఎనిమిది సార్లు సీపీఆర్ చేశామని, ప్రత్యేక పరిస్థితులను అంచనా వేసి తొమ్మిదోసారి ధైర్యం చేసి మళ్లీ సీపీఆర్ చేయడంతో గుండె లయ అందుకున్నదని.. నిజంగా ఇది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ మమతారెడ్డి తెలిపారు. అయితే, గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే మార్గంలో రక్తం గడ్డ కట్టిందని, అందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చామని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద దవాఖానకు తరలించామని ఆమె చెప్పారు.