KTR | రాజన్న సిరిసిల్ల, జూలై 27: పద్మశాలి సంఘం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సంఘం అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తానని పద్మశాలి సంఘ ప్రతినిధులకు భరోసా కల్పించారు.
సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు మార్కండేయ చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. అనంతరం పద్మశాలి సంఘానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అంశాలు, ఇతర ప్రజా సమస్యలను సంఘం నాయకులు కేటీఆర్కు వివరించారు. దీనికి కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్ సానుకూల స్పందనపై పద్మశాలి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, మండల సత్యం, గాజుల బాలయ్య, గెంట్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.